Bhu Bharati: భూ వివాదాలకు ఇక చెక్..! పక్కా లెక్క తేల్చేందుకు రోవర్, డ్రోన్లతో సర్వే.. ఆ ఐదు ప్రాంతాల్లో తొలుత.. సర్వే సాగేదిలా..
రిజిస్ట్రేషన్ - మ్యూటేషన్ చిక్కులేవీ లేకుండా స్పష్టమైన హక్కులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. భూమిపై నుంచి రోవర్ సహాయంతో.. ఆకాశం నుంచి డ్రోన్ తో సర్వే ..

land survey
Bhu Bharati: భూ భారతి చట్టంలో సాగు భూములు రిజిస్ట్రేషన్లకు సర్వే పటం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం సర్వే చేపట్టనుంది. ఇందులో భాగంగా తొలుత ఐదు జిల్లాల్లోని ఐదు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా సర్వే నిర్వహించనున్నారు. భూమిపై నుంచి రోవర్ సహాయంతో.. ఆకాశం నుంచి డ్రోన్ తో సర్వే చేస్తారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైనంత మంది సర్వేయర్లను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండు రోజుల్లో ఎంపిక చేసిన ఐదు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహించే సర్వే ద్వారా రెండేసి రిజిస్ట్రేషన్ల వివాదాలు, తక్కువ భూమి ఉంటే ఎక్కువ విస్తీర్ణానికి రిజిస్ట్రేషన్, దస్త్రాల్లో భూమి ఉండి క్షేత్ర స్థాయిలో లేకున్నా రిజిస్ట్రేషన్.. ఇలా రిజిస్ట్రేషన్ – మ్యూటేషన్ చిక్కులేవీ లేకుండా స్పష్టమైన హక్కులు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. తొలుత ఐదు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా సర్వే చేపట్టనున్నారు. ఖమ్మం జిల్లాలోని ములుగుమాడు, జగిత్యాల జిల్లాలోని కొమ్మనపల్లి(న్యూ), మహబూబ్ నగర్ జిల్లాలో సలార్ నగర్, ములుగు జిల్లాలో వెంకటాపురం, సంగారెడ్డి జిల్లాలోని సాహెబ్ నగర్ గ్రామాల్లో ఈ సర్వే జరుగుతుంది.
అనుభవమున్న ఐదు సంస్థలకు పైలట్ సర్వేను ప్రభుత్వం అప్పగించింది. భూమిపై నుంచి రోవర్ సహాయంతో.. ఆకాశం నుంచి (ప్లై) డ్రోన్ తో సర్వే చేస్తారు. ఈ సర్వేల వివరాలను పోల్చుతారు. ప్రతి కమతాన్నీ సర్వే చేసి ఒక ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. పహాణీల్లో ఉన్న వివరాలను, సర్వేలో వచ్చిన వివరాలను సరిచూస్తారు. ఈ సర్వే రిపోర్టును జిల్లా కలెక్టర్ కు సమర్పించి ప్రభుత్వ పరిశీలనకు పంపుతారు.