Uttam Kumar Reddy : కార్యకర్తల త్యాగం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి.. ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్ రాదు : మంత్రి ఉత్తమ్
Uttam Kumar Reddy : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్రస్టేషన్లో, డిఫ్రెషన్లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని చెప్పడం ఈ దశాబ్దం జోక్ అంటూ ఎద్దేవా చేశారు.
Uttam Kumar Reddy : హుజూర్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అయినా మొక్కవోని దీక్షతో భారీ మెజారిటీతో నియోజకవర్గంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ను గెలిపించారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసులు, దాడులతో హింసకు గురైనప్పటికీ, కార్యకర్తల త్యాగం వల్లే ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉందని చెప్పారు. ఆదివారం హుజూర్నగర్లో నిర్వహించిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభ లో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు.
ఈ సందర్భంగా భారత దిశ దశను నిర్ణయించే ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఓ వైపు పాసిస్ట్, నియంతృత్వ మోడీ పాలన ఉందని విమర్శించారు. మతం పేరుతో ప్రజలను నిలువునా చీలుస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లు దేశానికి, తెలంగాణకు, నల్గొండ పార్లమెంట్కు మోడీ సర్కార్ ఏమి చేయలేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని అన్నారు.
ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవబోతుంది :
పదేళ్లు రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిందని, అందుకే శాసనసభ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్ధకం కానుందని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల మొదటి విడతలో ఇండియా కూటమి అనుకూల వాతావరణం స్పష్టమైందన్నారు. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలవబోతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి కాబోతున్నారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్రస్టేషన్లో, డిఫ్రెషన్లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని చెప్పడం ఈ దశాబ్దం జోక్ అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ కుటుంబం మినహా బీఆర్ఎస్లో కింది నుంచి పైదాకా కాంగ్రెస్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్ రాదన్నారు. హుజూర్నగర్లో భారీ మెజార్టీ అందించాలని మంత్రి ఉత్తమ్ ఆకాంక్షించారు.
Read Also : ఆ పుస్తకాన్ని ఈ నియోజక వర్గంలో 75 వేల మందికి పంచుతాను: రఘునందన్ రావు