Medical College : హుజూరాబాద్‌కు మెడికల్‌ కాలేజీ?

ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్‌పై వరాల వర్షం కురిపిస్తోంది. టీఆర్‌ఎస్‌ సర్కార్‌.. ఇప్పుడు మెడికల్‌ కాలేజీ ఇవ్వబోతున్నట్టు సంకేతాలు ఇస్తోంది.

Medical College : హుజూరాబాద్‌కు మెడికల్‌ కాలేజీ?

Huzurabad

Updated On : September 13, 2021 / 8:36 AM IST

medical college in Huzurabad : ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్‌పై వరాల వర్షం కురిపిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలను జెట్‌ స్పీడ్‌తో అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌ సర్కార్‌.. ఇప్పుడు మెడికల్‌ కాలేజీ ఇవ్వబోతున్నట్టు సంకేతాలు ఇస్తోంది. పార్టీ నేతలు, మంత్రులు పరోక్షంగా ప్రస్తావిస్తున్న ఈ అంశంపై ప్రభుత్వం ఎప్పుడు క్లారిటీ ఇస్తుందోని ఎదురు చూస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికపై దృష్టి పెట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తునే… సంక్షేమ పథకాలు భారీ స్థాయిలో అమలు చేస్తోంది. బీజేపీ అభ్యర్ధిగా బరిలో దిగనున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు ప్రజలు అడిగిన వాటితో పాటు , అడగనివీ ఇస్తోంది. తాజాగా మెడికల్‌ కాలేజీ అంశాన్ని తెరపైకి తెచ్చింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ గెలుపు కోసం వ్యూహాత్మంగా అడుగులు వేస్తున్న టీఆర్‌ఎస్‌ నేతలు, మంత్రులు.. ఈ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు. ఏడేళ్లు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌.. ఈ ప్రాంతానికి మెడికల్‌ కాలేజీ కావాలని ఏ రోజైనా అడిగారా.. అని ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ను ఇరకాటంలో పెట్టి, ఆత్మరక్షణలోకి నెట్టడానికి మెడికల్‌ కాలేజీ అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తున్నారని టీఆర్‌ఎస్‌లో చర్చ సాగుతోంది. హుజూరాబాద్‌లో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సైతం సంకేతాలు ఇవ్వడంతో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. కరీంనగర్‌లో ప్రభుత్వం మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీ నెరవేరలేదు. దీని సాధన ఆందోళనలు, నిరసనలు కోనసాగుతూనే ఉన్నాయి. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అమరణ నిరహరదీక్ష చేసినప్పటికీ ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు అంశం హమీగానే మిగిలిపోయింది.

Huzurabad : అక్టోబర్ – నవంబర్ లోనే హుజూరాబాద్ బైపోల్!

కరీంనగర్ రెండు ప్రయివేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దీంతోనే ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడంలేదన్న విమర్శలున్నాయి. ఇటీవల జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని సర్కారు ప్రకటించినా.. ఆ జాబితాలో కరీంనగర్ లేక పోవడంతో నిరసన వ్యక్తమవుతోంది. జగిత్యాల జిల్లాతో పాటు, పెద్దపల్లి జిల్లా రామగుండం సిరిసిల్లకు మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ప్రకటించింది. కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల అంశం పెండింగ్‌లో ఉండటంతో హుజూరాబాద్‌కు దానిని ప్రకటించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ నేతల్లో చర్చ జరుగుతోంది.

హుజూరాబాద్ లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే మూడు జిల్లాలకు వైద్య సేవలు అందతాయి. హుజూరాబాద్‌, మానకొండూర్, హుస్నాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాలతో పాటు హన్మకొండ జిల్లాలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడుతుంది. ఈ ఆలోచనతోనే హుజూరాబాద్‌కు మెడికల్‌ కాలేజీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు గతంలో ఇచ్చిన హమీ నెరవేరడంతో పాటు రాజకీయంగా మేలు జరుగుతుందన్న ఆశాభావంతో టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఉంది.