Kodandaram : కేసీఆర్ నిరంకుశ పాలన అంతం కోసం.. కాంగ్రెస్ తో కలిసి పని చేస్తాం : కోదండరాం
ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. ప్రజాస్వామిక పాలన కోసం కలిసి పని చేస్తామని చెప్పారు.

TJS Chief Kodandaram
Kodandaram Support Congress : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జనసమితి మద్దతు ప్రకటించింది. కేసీఆర్ నిరంకుశ పాలన అంతం కోసం కాంగ్రెస్ తో కలిసి పని చేస్తామని టీజేఎస్ చీఫ్ కోదండరాం స్పష్టం చేశారు. ప్రజా పరిపాలన కోసం తమ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం కాంగ్రెస్ తో కలిసి పని చేయాలని భావిస్తున్నామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం తెలంగాణ జనసమితి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. ప్రజాస్వామిక పాలన కోసం కలిసి పని చేస్తామని చెప్పారు. తమ ఉమ్మడి కార్యక్రమం సాధించే లక్ష్యంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. తమ నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. తమ నిర్ణయానికి తెలంగాణ ప్రజలు మద్దతు తెలపాలని కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు.
కాగా, కోదండరాం కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరేందుకు సోమవారం టీజేఎస్ కార్యాలయానికి రేవంత్ వెళ్లారు. అక్కడికి వెళ్లిన రేవంత్.. కోదండరాంను కలిసి కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కోదండరాం పోరాడుతున్నారని తెలిపారు. తెలంగాణకు పట్టిన చీడ, పీడ వదలాలంటే కోదండరాం సహకారం అవసరం అన్నారు.
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కలిసి ముందుకెళతామని చెప్పారు. భవిష్యత్ లో సమన్వయ కమిటీని నియమించుకుని ముందుకెళతామని పేర్కొన్నారు. టీజేఎస్ నుంచి ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యేలా కమిటీ ఉంటుందన్నారు. ఎన్నికల క్షేత్రంలో టీజేఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తుందని తెలిపారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజేఎస్ కు కీలక స్థానం ఉంటుందని వెల్లడించారు.