Telangana : పోలీసుశాఖలో త్వరలో 20 వేల ఉద్యోగాల భర్తీ… హోంమంత్రి మహమూద్ అలీ
తెలంగాణ పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో త్వరలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు.
Telangana : తెలంగాణ పోలీసు శాఖలో వివిధ విభాగాల్లో త్వరలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ తెలిపారు. రూ. కోటి వ్యయంతో నిర్మించిన సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి శనివారం ప్రారంభించారు. 2014 లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వివిధ విభాగాలలో ఇప్పటివరకు 80 వేల మందిని పోలీసు శాఖలో రిక్రూట్ చేసినట్లు ఆయన చెప్పారు.
మహిళకు ప్రాధాన్యత ఇస్తూ నియామకాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందిన మహిళా కానిస్టేబుల్ను రిసెప్షనిస్ట్గా నియమించడం ద్వారా సామాన్య ప్రజలు ఎటువంటి భయం లేకుండా పోలీస్ స్టేషన్కి వస్తున్నారని మంత్రి పేర్కోన్నారు. మహిళలకు రక్షణ నిమిత్తం షీ టీమ్స్ ఏర్పాటుచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు మహమూద్ అలీ తెలిపారు. తగినన్నీ నిధులు కేటాయించడం ద్వారా పోలీసుశాఖ నూతన వాహనాలు సమకూర్చుకోవడం గానీ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకుంటూ సమర్థ పోలీసింగ్ను నిర్వహిస్తోందన్నారు. శాంతిభద్రతలకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్న హోంమంత్రి దేశంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో 70 శాతం తెలంగాణలోనే ఉన్నాయన్నారు.
కేసులను ఛేదించడంలో సీసీ కెమెరాలు పోలీసుల పనిని సులభతరం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నేరాలకు పాల్పడేందుకు నేరస్థులు భయపడుతున్నారన్నారు. ఇక్కడి పోలీసులు గంటల్లోనే కేసులను ఛేదించగలుగుతున్నట్లు హోంమంత్రి చెప్పారు.కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషించిందని…. గతేడాది కాలంగా లాక్డౌన్ సమయాల్లో పోలీసులు చేస్తున్న త్యాగాలను హోంమంత్రి ప్రశంసించారు.