Cloudburst : సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి ?
అసలు ఏంటి క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి ? వరద విలయాన్ని కృత్రిమంగా సృష్టించొచ్చా ? గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయి ? క్లౌడ్ బరస్ట్తో మనపై కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ?

Cm Kcr Godavari Pooja
Cloudburst : రాష్ట్రంలో వరదలపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. వరదల వెనుక విదేశీ కుట్ర ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఈరోజు భద్రాచలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతితో వరదలు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో లేహ్, ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ చేశారని గుర్తు చేశారు.
ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతాల్లో కుట్రలు చేస్తున్నట్లు సమాచారం వస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అసలు ఏంటి క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి ? వరద విలయాన్ని కృత్రిమంగా సృష్టించొచ్చా ? గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయి ? క్లౌడ్ బరస్ట్తో మనపై కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ?
అసలు క్లౌడ్ బరస్ట్ అంటే….ఒకటి నుండి పది కిలోమీటర్ల లోపు ఒక గంటలో 10 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని మేఘాల విస్ఫోటనం లేదా క్లౌడ్ బరస్ట్ అంటారు. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువసార్లు క్లౌడ్ బరస్ట్ లు సంభవిస్తాయి. అలాంటప్పుడు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. క్లౌడ్ బరస్ట్కు కారణాలు భౌగోళిక, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రుతుపవనాలు దక్షిణాన అరేబియా సముద్రం నుంచి కొంత తేమను తీసుకు వస్తాయి.
వెస్ట్రన్ డిస్టర్బెన్స్ కారణంగా మధ్యధరా తీరం నుంచి వీస్తున్న గాలులు పశ్చిమాన ఇరాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్ నుంచి తేమను తోడ్కొని వస్తాయి. ఈ రెండూ ఢీకొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. ఇవి అకస్మాత్తుగా తక్కువ సమయంలో భారీగా వర్షిస్తాయి. పర్వతాలపై తరచూ ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి తక్కువ సమయంలో కుంభవృష్టి కురిపిస్తాయి. ఆ కారణంగా పర్వతాలపై క్లౌడ్ బరస్ట్ సంఘటనలు అధికంగా జరుగుతుంటాయి. రుతుపవనాలు వచ్చే ముందు, వచ్చిన తరువాత కూడా క్లౌడ్ బరస్ట్ జరుగుతుంటుంది.
తెలంగాణలో 5వందల ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా కడెం ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ప్రాజెక్ట్కు కలలో కూడా ఊహించనంతా వరద పోటెత్తింది. కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కచ్చితంగా దీనివెనుక ఏదో ఒక కుట్ర దాగుండే అవకాశం ఉందంటున్నారు. 2013లో ఉత్తరాఖండ్లో వరదలు పోటెత్తడంతో భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. దీనికి కూడా క్లౌడ్ బరస్ట్ కారణమన్న అనుమానాలూ ఉన్నాయి. అదే సమయంలో కుంభవృష్టి కురిసిన ప్రతిసారీ దానిని క్లౌడ్ బరస్ట్ అని చెప్పలేం.
సాధారణంగా రుతు పవనాలు వచ్చేముందు ఇలాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. మే నుంచి జూలై-ఆగస్ట్ వరకు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో మాత్రం ఇటువంటి ఘటనలకు అవకాశం లేదు. కానీ కృత్రిమంగా క్లౌడ్ బరస్ట్ చేయాలని చూస్తే మాత్రం కచ్చితంగా ఇది సాధ్యమే! ఇప్పుడు సీఎం కేసీఆర్ వ్యక్తం చేస్తున్న సందేహాం కూడా ఇదే !
ప్రకృతి వైపరీత్యాలను కూడా చైనా లాంటి దేశాలు తమకు అనుకూలంగా వినియోగించుకుంటున్నాయన్న వాదన కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలను కృత్రిమంగా సృష్టించగలిగే.. టెక్నాలజీ డ్రాగన్ దగ్గర ఉంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్ సమయంలో చైనా ఇదే చేసింది. ఒలింపిక్స్కు ఒక్కరోజు ముందు.. అన్నీ గ్రౌండ్స్లో వాటర్ లీకేజీని పరిశీలించేందుకు చైనా కృత్రిమ వర్షాలను సృష్టించింది. అప్పుడే అర్థమైంది ఈ టెక్నాలజీ సాయంతో చైనా తన శత్రు దేశాల్లో కృత్రిమంగా ప్రకృతి విపత్తులు సృష్టించే అవకాశం ఉందని అప్పట్లోనే అంచనా వేశారు.
ఇప్పుడు చైనా అదే పనిలో ఉందన్న సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే 1970 నుంచి 2016 మధ్య జమ్ముకశ్మీర్, లెహ్తో పాటు ఉత్తరాఖండ్లోని పెహల్గామ్ నుండి సుదూరంగా తూర్పున ఉన్న అరుణాచల్ప్రదేశ్ వరకు 30 క్లౌడ్ బరస్ట్లు సంభవించాయి. దీని కారణంగా సుమారుగా 20వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అన్నీ క్లౌడ్ బరస్ట్లకు చైనానే కారణమని చెప్పలేం కానీ.. కచ్చితంగా ఇందులో కొన్ని క్లౌడ్ బరస్ట్ల పాపం డ్రాగన్దేనన్న వాదనలు ఉన్నాయి. ఇప్పుడు గోదావరిలోనూ క్లౌడ్ బరస్ట్ కుట్ర జరుగుతోందన్న కేసీఆర్ వ్యాఖ్యలతో అందరి చూపు చైనాపై పడుతోంది.
కాగా…. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొట్టి పారేశారు. ఇది సాధ్యమయ్యేది కాదని..ఆయన స్టేట్మెంట్ లో సెన్స్ లేదు.. సిల్లి గా ఉందని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ కుట్ర తో వరదలు వచ్చాయనేది సిల్లి. తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేయాలని సీఎం కేసీఆర్ చూసారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం సరైంది కాదని.. కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిపోయింది.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కేసీఆర్ క్లౌడ్ బరస్టు అన్నారని ఉత్తమ్ చెప్పారు.
Also Read : CM KCR : సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..ఆకస్మిక వరదల వెనుక విదేశీ కుట్రలు