YSR Telangana Party : షర్మిల కొత్త పార్టీ జెండా వివరాలివే
తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్న విషయం విదితమే.. జులై 8 న పార్టీ ప్రకటన ఉండనుంది. ఇక ఈ నేపథ్యంలోనే పార్టీ జెండాను సిద్ధం చేశారు. రాజశేఖర్ రెడ్డి చిత్రం, పాలపిట్ట రంగుతో ఈ జెండా ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి
YSR Telangana Party : దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో ఏర్పాటు చేయనున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఖరారైంది. జెండాను తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రంగుతో రూపొందించారు. జెండాలో 80 శాతం పాలపిట్ట రంగు ఉండగా.. మిగిలిన 20 శాతం నీలి రంగు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇక జెండా మధ్యలో తెలంగాణ భౌతిక స్వరూపం, అందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రం ఉండేలా డిసైన్ చేశారు. జెండాకు సంబందించిన వివరాలను శనివారం ఆ పార్టీ ప్రోగ్రాం కోఆర్టినేటర్ వాడుక రాజగోపాల్ తెలిపారు. ఇక ఈ పార్టీని దివంగత రాజశేఖర్ రెడ్డి జయంతి రోజైన జులై 8న ప్రారంభించనున్నారు. పార్టీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్ ఫిలింనగర్లోని జేఆర్సీ సెంటర్లో నిర్వహించనున్నారు. దీనికి సంబందించిన ఏర్పాట్లు చేస్తున్నారు పార్టీ నేతలు. ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాలకు చెందిన ముఖ్యనేతలు హాజరవుతారని సమాచారం.
ఇక ఇప్పటికే షర్మిల తన పార్టీకి వ్యూహకర్తను కూడా నియమించుకున్నట్లు సమాచారం. ప్రశాంత్ కిశోర్ టీమ్లో కీలకంగా వ్యవహరించిన ప్రియను తాను పెట్టబోయే కొత్త పార్టీకి వ్యూహకర్తగా వైఎస్ షర్మిల ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కూతురు ప్రియ. తాజాగా లోటస్పాండ్లో షర్మిలను వ్యూహకర్త ప్రియ కలిశారు.
ఇక వైఎస్ షర్మిల గత కొంత కాలంగా తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు. తాజాగా ఆమె ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. అక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలతో భేటీ అయ్యారు. అనంతరం సింగరేణి కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.