కొత్త సిమ్ తీసుకున్న యువకుడు.. అది ఆర్సీబీ కెప్టెన్‌ వాడిన నంబరు కావడంతో కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నుంచి కాల్స్‌.. చివరకు..

నిజంగా పటీదార్ ఫోన్‌ చేశాడంటే మనీశ్‌, ఖేమ్‌రాజ్‌ నమ్మలేదు. ఎవరో ప్రాంక్ కాల్ చేస్తున్నారని మనీశ్‌, ఖేమ్‌రాజ్‌ అనుకున్నారు. దీంతో "నేను ఎమ్మెస్‌ ధోనీని మాట్లాడుతున్నాను" అని ఖేమ్‌రాజ్‌ సమాధానమిచ్చాడు.

కొత్త సిమ్ తీసుకున్న యువకుడు.. అది ఆర్సీబీ కెప్టెన్‌ వాడిన నంబరు కావడంతో కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నుంచి కాల్స్‌.. చివరకు..

Updated On : August 10, 2025 / 5:07 PM IST

మొబైల్‌ షాప్‌నకు వెళ్లి కొత్త సిమ్ కార్డు తీసుకున్నాడు ఓ యువకుడు. ఆ తర్వాత అతడికి దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, రజత్ పటీదార్ నుంచి కాల్స్‌ వచ్చాయి. దీంతో ఆ యువకుడు షాక్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందో వివరంగా తెలుసుకుందాం..

ఛత్తీస్‌గఢ్‌ గారియాబంద్‌ జిల్లాలో కిరాణా దుకాణం నడుపుకుంటూ జీవిస్తున్న మనీశ్ అనే యువకుడు తన స్నేహితుడు ఖేమ్‌రాజ్‌తో కలిసి వెళ్లి స్థానిక దుకాణంలో కొత్త సిమ్‌ కార్డ్‌ కొనుగోలు చేశాడు.

స్మార్ట్‌ఫోనులో ఆ నంబర్‌ వేసి వాట్సాప్‌ యాక్టివేట్‌ చేయగానే అందులో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్‌ రజత్‌ పటీదార్‌ ఫొటో కనపడింది. దాన్ని వారు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కోహ్లీ, డివిలియర్స్‌ వంటి వారు ఆ నంబరుకు చేశారు.

తరువాత తెలిసింది ఏమిటంటే, ఆ నంబర్‌ రజత్ పటీదార్‌ పాత నంబర్‌. 90 రోజుల పాటు వాడకపోవడంతో మొబైల్‌ ఆపరేటర్‌ డీయాక్టివేట్‌ చేసి మనీశ్‌కు దాన్ని అమ్మాడు.

Also Read: దంచికొడుతున్న వర్షం.. ఈ నెల 14 వరకు ఈ ప్రాంతాల్లో ఇంతే..

ఈ విషయం తెలిసిన తర్వాత రజత్ పటీదార్‌ స్వయంగా మనీశ్‌, ఖేమ్‌రాజ్‌కు ఫోన్‌ చేశాడు. వారు నిజంగానే ఆ స్టార్‌ క్రికెటర్‌ మాట్లాడుతున్నాడని నమ్మలేదు. “భాయ్‌, నేను రజత్‌ పటీదార్‌ని, ఆ నంబర్‌ నాది, దయచేసి తిరిగి ఇవ్వండి” అని ఆర్సీబీ కెప్టెన్‌ పటీదార్‌ అన్నాడు.

నిజంగా పటీదార్ ఫోన్‌ చేశాడంటే మనీశ్‌, ఖేమ్‌రాజ్‌ నమ్మలేదు. ఎవరో ప్రాంక్ కాల్ చేస్తున్నారని మనీశ్‌, ఖేమ్‌రాజ్‌ అనుకున్నారు. దీంతో “నేను ఎమ్మెస్‌ ధోనీని మాట్లాడుతున్నాను” అని ఖేమ్‌రాజ్‌ సమాధానమిచ్చాడు.

దీంతో పటీదార్‌ విషయం వివరించి, క్రికెట్‌ రంగంలోని ముఖ్య వ్యక్తులతో సంప్రదించేందుకు ఆ నంబర్‌ అవసరమని చెప్పాడు. కానీ, మనీశ్‌, ఖేమ్‌రాజ్‌కు సిమ్ కార్డు ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో “సరే, పోలీసులను పంపిస్తాను” అంటూ రజత్ పటీదార్ ఫోన్ పెట్టేశాడు.

స్థానిక పోలీసులు 10 నిమిషాల్లో మనీశ్ ఇంటికి వచ్చారు. అప్పుడు తాము నిజంగానే కోహ్లీ, డివిలియర్స్‌తో మాట్లాడామని మనీశ్‌, ఖేమ్‌రాజ్‌ గ్రహించారు. వెంటనే సిమ్‌ కార్డ్‌ తిరిగి ఇచ్చేశారు. “తప్పుడు నంబర్‌ వల్ల కోహ్లీతో మాట్లాడే అవకాశం వచ్చింది. నా జీవిత లక్ష్యం నెరవేరింది” అని ఖేమ్‌రాజ్‌ ఉబ్బితబ్బిబ్బయిపోయాడు.