బోటులో 77మంది ప్రయాణిస్తున్నారు.. మంత్రి కన్నబాబు

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన బోటులో 77 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. తొలుత బోటులో 73 మంది ఉన్నారని భావించినప్పటికీ.. బాధితుల సమాచారం ప్రకారం 77మంది ఉన్నట్లు తెలిసిందన్నారు.
ఇంకా 16మంది ఆచూకీ తెలియాల్సి ఉందని మంత్రి వెల్లడించారు. వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు 9 మందిగా.. ఏడుగురు తెలంగాణకు చెందిన వారని మంత్రి తెలిపారు. మరోవైపు గోదావరి బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం (సెప్టెంబర్ 20, 2019) మరో మహిళ మృతదేహాం కచ్చలూరు వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. మృతదేహాన్ని దేవీపట్నం పోలీస్ స్టేషన్కి తరలించారు.
సెప్టెంబర్ 15వ తేదీన జరిగిన ప్రమాదంలో గల్లంతైన వారి కోసం NDRF, SDRF దళాలు ఇంకా గాలిస్తున్నాయి. బోటలో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే దానిపై రోజుకో సంఖ్య బయటకోస్తుంది. తాజాగా మంత్రి కన్నబాబు చెప్పిన లెక్కల ప్రకారం 77 మంది ప్రయాణిస్తున్నట్లు తేలింది.