పండుగ : ప్రతి సంక్రాంతికి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపడానికి ప్రతీ ఏటా జనవరిలో ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రభుత్వ శాఖల్లో వివధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ జనవరిలో భర్తీ చేస్తామని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో అర్హత సాధించి ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆయన సోమవారం సెప్టెంబరు 30న విజయవాడలో నియామక పత్రాలు అందజేశారు. ఈ ఉద్యోగాల్లో అర్హత సాధించలేని వారు అధైర్యపడవద్దని.. ఉద్యోగాల విప్లవం ఇంతటితో ఆగిపోదని.. ఇకపై కూడా కొనసాగుతుందని యువతకు సీఎం జగన్ హామీ ఇచ్చారు.
జనవరి1 నుంచి జనవరి 30 దాకా ప్రతీ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసే వీలు కల్పిస్తామని తెలిపారు. ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీగా ఉంచే ప్రసక్తే లేదని.. జనవరి నెల సమీపిస్తున్నందున నిరుద్యోగులంతా సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.
ఇరవై లక్షల పైచిలుకు మంది పోటీపడిన పరీక్షల్లో అర్హత సాధించి.. ఉద్యోగం పొందినవారికి ఆయన అభినందనలు తెలిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా.. అర్హులైన వారందరికి ప్రభుత్వ పథకాలను చేరువ చేసే బాధ్యత గ్రామ సచివాలయ ఉద్యోగులదేనని జగన్ అన్నారు. గ్రామ సచివాలయ పరీక్షలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రతీ శాఖ అధికారులను సీఎం జగన్ పేరుపేరునా అభినందించారు.