పాస్ పోర్ట్ పోగొట్టుకొని..18 ఏళ్లు పాక్ జైల్లో గడిపి..ఎట్టకేలకు భారత్ కు
Indian woman freed from Pakistani jail భర్త తరపు బంధువుల్ని కలవడానికి పాకిస్తాన్ వెళ్లిన భారతీయ మహిళ హసీనాబేగం(65)కు 18ఏళ్ల తర్వాత ఎట్టకేలకు విముక్తి లభించింది. పాస్పోర్ట్ పోగొట్టుకోవడం వల్ల 18 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించించిన ఆమె..ఎట్టకేలకు ఔరంగాబాద్ పోలీసుల సహకారంతో మంగళవారం స్వస్థలానికి చేరుకుంది.
మహారాష్ట్రలోని ఔరంగబాద్కు చెందిన 65 ఏళ్ల హసీనా బేగమ్ 18 ఏళ్ల క్రితం ఆమె భర్త బంధువులను కలుసుకునేందుకు పాకిస్తాన్ కి వెళ్లింది. లాహోర్లో ఆమె పాస్పోర్ట్ పోగొట్టుకుంది. పాస్పోర్ట్ లేని కారణంగా హసీనాకు పాకిస్తాన్ జైలు శిక్ష విధించింది. అయితే, ఆమె ఆదృశ్యం అయినట్లు బంధువులు ఔరంగాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరకు ఆమె లాహోర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నట్లు గుర్తించారు.
హసీనా నిర్దోషి అని రుజువు అవ్వడానికి భారత్ నుంచి పాకిస్తాన్ సమాచారం కోరింది. దీనిపై ఔరంగబాద్ పోలీసులు పాక్ అధికారులకు వివరాలు వెల్లడించారు. దీంతో హసీనాను గత వారం పాక్ భారత్కు అప్పగించింది. పాక్ జైలు నుంచి విడుదలై మంగళవారం ఆమె తన స్వస్థలానికి చేరుకుంది. స్వదేశానికి చేరుకోగానే ఆమె బంధువులు ఘన స్వాగతం పలికారు. భారత్కు తిరిగి రావడంలో సహకరించినందుకు ఔరంగబాద్ పోలీసులకు హసీనా, ఆమె కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనైన హసీనా ..చాలా కష్టాలను ఎదుర్కొన్నాను. నా దేశానికి తిరిగి రాగానే స్వర్గంలోకి వచ్చినట్లుంది అంటూ ఆనందం వ్యక్తం చేశారు.