Srivari Salakatla Brahmotsavam: సెప్టెంబర్ 27 నుండి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ప్రత్యేక దర్శనాలు రద్దు
తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు ఈసారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, మాడ వీధుల్లో వాహన సేవలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.(Srivari Salakatla Brahmotsavam)
Srivari Salakatla Brahmotsavam: తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 5వ తేదీ వరకు ఈసారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని, మాడ వీధుల్లో వాహన సేవలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్తో కలిసి శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో అన్ని విభాగాల అధికారులతో ప్రాథమిక సమీక్ష నిర్వహించారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు ఈవో ధర్మారెడ్డి. సెప్టెంబర్ 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం జరుగనుందని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వివరించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు. అక్టోబర్ 1న గరుడ వాహనం, అక్టోబర్ 2న స్వర్ణ రథం, అక్టోబర్ 4న రథోత్సవం, అక్టోబర్ 5న చక్రస్నానం జరుగుతాయని తెలిపారు.
కరోనా కారణంగా గతంలో రెండు పర్యాయాలు వాహన సేవలు ఏకాంతంగా నిర్వహించామని, ఈసారి మాడ వీధుల్లో వాహనసేవల ఊరేగింపు ఉంటుందని చెప్పారు. ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశముందని, ఇందుకనుగుణంగా పటిష్టంగా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించామని ఈవో తెలిపారు.
బ్రహ్మోత్సవాల రోజుల్లో వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. ఈసారి గరుడసేవ పెరటాసి మాసంలో మూడో శనివారం రోజున జరుగనుందని, భక్తులు విశేషంగా విచ్చేసే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపడతామని వివరించారు. సామాన్య భక్తులకు ఎక్కువ దర్శన సమయం కల్పించేందుకు బ్రేక్ దర్శనాలు రద్దు చేశామని, ఫ్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు మంజూరు చేస్తామని తెలిపారు.
తిరుమలలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తామని, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లోనూ పరిశుభ్రంగా ఉంచుతామని ఈవో తెలిపారు. వైద్య విభాగం ఆధ్వర్యంలో అవసరమైన ప్రాంతాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు ఏర్పాటు చేస్తామన్నారు. రుయా, స్విమ్స్ ఆసుపత్రుల నుంచి స్పెషలిస్టు డాక్టర్లను రప్పించి వైద్య సేవలు అందిస్తామన్నారు.
Srinivasa Klayanam : సెయింట్ లూయిస్లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
పోలీసులతో సమన్వయం చేసుకుని పటిష్టమైన భద్రత కల్పిస్తామని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తగినన్ని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తామని, గరుడ సేవ నాడు భక్తులు ద్విచక్ర వాహనాలను తిరుపతిలోనే పార్క్ చేసి బస్సుల్లో తిరుమలకు చేరుకోవాలని కోరారు. గరుడ సేవ జరిగే రోజుతో పాటు ఆ ముందు రోజు, తరువాతి రోజు ఆన్ లైన్ లో గదుల కేటాయింపు ఉండదని, మిగిలిన రోజులకు సంబంధించి 50 శాతం ఆన్ లైన్ లో కేటాయిస్తామని, మిగిలినవి కరెంట్ బుకింగ్లో భక్తులకు కేటాయిస్తామని చెప్పారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
భక్తులందరికీ అన్నప్రసాదాలు అందిస్తామని, మాడ వీధుల్లోని గ్యాలరీల్లో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేసి తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తామన్నారు. తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం అమల్లో ఉన్నందున భక్తులు గాజు లేదా రాగి లేదా స్టీల్ బాటిళ్లు వెంట తెచ్చుకోవాలని కోరారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంజినీరింగ్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. తిరుమలలోని భవనాలు, చెట్లపై విద్యుత్ అలంకరణలు చేపడతామన్నారు. గరుడ సేవ నాడు భక్తులు ఎత్తైన భవనాలు ఎక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాహన సేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామన్నారు. భక్తులకు సేవలందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను ఆహ్వానిస్తామని ఈవో చెప్పారు.
ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, ఎఫ్ఎసిఎఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ట్రాన్స్పోర్టు జిఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈవోలు రమేష్ బాబు, హరీంద్రనాథ్, ఇతర డిప్యూటీ ఈవోలు, ఈఈలు, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆర్టీసీ ఆర్ఎం చెంగల్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.