Obama on Modi Tour: మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇండియాలో ముస్లింల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన బరాక్ ఒబామా
అమెరికా కాంగ్రెస్లో ప్రధాని మోదీకి మీడియా ఇదే ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ ప్రతి పౌరుడి గౌరవాన్ని భారతీయులు విశ్వసిస్తారని, ఇది భారత డీఎన్ఏలోనే ఉందని అన్నారు. కులం, మతం, లింగం వంటి వివక్షకు అసలు తావే లేదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు.
Modi USA Tour: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. గురువారం అమెరికా కాంగ్రెస్ను ఉద్దేశించి కీలక ప్రసంగం చేసిన అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో కలిసి మీడియా సమావేశంలో కూడా పాల్గొన్నారు. దీనికి కొద్ది సమయం ముందు ఇండియాలోని ముస్లిం మైనారిటీల భద్రతపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. అంతే కాకుండా.. మోదీని కలిసిన సమయంలో ఈ విషయమై ప్రస్తావన లేవనెత్తాలని ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ను ఒబామా కోరారు.
సీఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా మాట్లాడుతూ ‘‘ప్రధాని మోదీతో అధ్యక్షుడు బైడెన్ సమావేశమైతే మెజారిటీ హిందూ దేశమైన ఇండియాలో ముస్లిం మైనారిటీ భద్రత గురించి తప్పనిసరిగా చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రధాని మోదీతో నాకు ఒకసారి చర్చ సాగింది. చర్చలో భాగంగా భారతదేశంలోని మైనారిటీల హక్కులను కనుక మీరు రక్షించకపోతే దానిపై చర్చ అసంపూర్తిగానే ఉండిపోతుంది’’ అని అన్నారు. ఇక మిత్ర దేశాలతో మానవ హక్కుల గురించి చర్చించడం, ప్రశ్నించడం ఎప్పుడైనా చాలా క్లిష్టమైందని ఆయన అన్నారు.
‘నిరంకుశ ప్రజాస్వామ్యవాది’గా పరిగణించబడే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, ప్రధానమంత్రి ప్రధాని మోదీ వంటి నాయకులతో బైడెన్ ఎలా వ్యవహరించాలనే దానిపై సీఎన్ఎన్ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ క్రిస్టియన్ అమన్పూర్ అడిగిన ప్రశ్నకు ఒబామా పై విధంగా బదులిచ్చారు. అయితే అమెరికా కాంగ్రెస్లో ప్రధాని మోదీకి మీడియా ఇదే ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ ప్రతి పౌరుడి గౌరవాన్ని భారతీయులు విశ్వసిస్తారని, ఇది భారత డీఎన్ఏలోనే ఉందని అన్నారు. కులం, మతం, లింగం వంటి వివక్షకు అసలు తావే లేదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు.