Chittoor Girls Missing : ఒకేరోజు నలుగురు అమ్మాయిలు మిస్సింగ్.. చిత్తూరులో కలకలం, అసలేం జరుగుతోంది?
గడిచిన కొంతకాలంగా చిత్తూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. అమ్మాయిల అదృశ్యం వెనుక పలు కారణాలు ఉన్నాయి. Chittoor Girls Missing Case
![Chittoor Girls Missing : ఒకేరోజు నలుగురు అమ్మాయిలు మిస్సింగ్.. చిత్తూరులో కలకలం, అసలేం జరుగుతోంది? Chittoor Girls Missing : ఒకేరోజు నలుగురు అమ్మాయిలు మిస్సింగ్.. చిత్తూరులో కలకలం, అసలేం జరుగుతోంది?](https://10tv.in/wp-content/uploads/2023/09/Chittoor-Girls-Missing.jpg)
Chittoor Girls Missing Case
Chittoor Girls Missing Case : చిత్తూరులో నలుగురు అమ్మాయిల మిస్సింగ్ కలకలం రేపుతోంది. చిత్తూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అమ్మాయిల అదృశ్యంపై కేసు నమోదైంది. మిస్ అయిన నలుగురిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరిని గుర్తించి వారిని స్టేషన్ కు తీసుకొచ్చారు. మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
నిన్న(సెప్టెంబర్ 2) ఉదయం నుంచి ఈ నలుగురు అమ్మాయిలు కనిపించకుండా పోయారు. ఇందులో ముగ్గురు మైనర్లు ఉన్నారు. నిన్న సాయంత్రం వరకు పూర్తిగా గాలించిన తర్వాత వారి వారి కుటుంబసభ్యులు చిత్తూరు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో ప్రత్యేక టీమ్ ని ఏర్పాటు చేసిన పోలీసులు నిన్న రాత్రి నుంచి ముమ్మరంగా గాలించారు. వారి గాలింపు చర్యలు కొంత ఫలించాయి.
ఈ ఉదయం(సెప్టెంబర్ 3) మిస్ అయిన నలుగురిలో ఇద్దరు మైనర్లను గుర్తించారు. మరో మైనర్, మేజర్ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి అదృశ్యం అయిన ఆ ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
కాగా, గడిచిన కొంతకాలంగా చిత్తూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. అమ్మాయిల అదృశ్యం వెనుక పలు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ఇంట్లో వేర్వేరు కారణాలతో తల్లిదండ్రులపై అలకబూనడం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవడం. రెండవది ప్రేమ వ్యవహారం. మూడవది చదువులో వెనుకబడటం. కాగా, ఈ మధ్య కాలంలో ప్రేమ వ్యవహారాల్లో అమ్మాయిల మిస్సింగ్ లు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ క్రమంలో పోలీసులు అమ్మాయిల తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలన్నారు. వారు ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? వారు ఫ్రెండ్స్ ఎవరు? ఇలాంటి అంశాలపై నిత్యం నిఘా ఉంచాలన్నారు పోలీసులు. ఇక, అమ్మాయిల అదృశ్యం కేసుని స్వయంగా చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. వీలైనంత త్వరగా వారి ఆచూకీ కనిపెట్టాలని పోలీసులను ఆదేశించారు.
మరోవైపు తమ పిల్లలు కనిపించకుండా పోవడం పట్ల వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు ఏమయ్యారు? ఎక్కడికి వెళ్లారు? వారి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? అన్నది తెలియక భయాందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా తమ పిల్లలను వెతికి పెట్టాలని పోలీసులను వేడుకుంటున్నారు.