Minister Roja : జగన్ చెప్పినట్టు దేవుడు ఉన్నాడు, విధిని ఎవరూ తప్పించుకోలేరు, ఏ తప్పు చేయని జగన్ని అరెస్ట్ చేయించారు- చంద్రబాబుపై మంత్రి రోజా ఫైర్
జగన్ చెప్పినట్లు తప్పు చేసిన వారు ఎవరూ భగవంతుడి నుంచి తప్పించుకోలేరు. దేవుడు ఉన్నాడు. Roja Selvamani
Roja Selvamani : స్కిల్ స్కామ్ లో చంద్రబాబు రిమాండ్ కుపై ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు టార్గెట్ గా ఆమె నిప్పులు చెరిగారు. జగన్ చెప్పినట్టుగానే దేవుడు ఉన్నాడని రోజా ఎమోషనల్ అయ్యారు. విధిని ఎవరూ తప్పించుకోలేరని, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందేనని కర్మ సిద్ధాంతం మాట్లాడారు.
నాడు ఏ తప్పు చేయని జగన్ ను, రాజకీయంగా అణగదొక్కేందుకు అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించారని రోజా వాపోయారు. నేడు అన్ని సాక్ష్యాధారాలతో చంద్రబాబుని జైలుకి పంపించామని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబుకి జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వగానే.. మంత్రి రోజా సంబరాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచి, టపాసులు కాల్చారు. జై జగన్ అంటూ నినాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈ కేసులో జైల్లోకి వెళ్లిన చంద్రబాబు.. ఇక బయటకు రారని, జీవితాంతం జైల్లోనే ఉంటారని మంత్రి రోజా అన్నారు.
”చచ్చే లోపల విధి అనేది తప్పక శిక్ష వేస్తుంది. చంద్రబాబు చేసిన తప్పులకు ఇది ఆరంభం మాత్రమే. ఆయన చేసిన అవినీతి మొత్తం బయటకు వస్తుంది. ఇక జీవితంలో చంద్రబాబు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. 2014 నుంచి 2019వరకు ఎన్ని స్కామ్ లో చేశారో అన్నీ సాక్ష్యాధారాలతో ఉన్నాయి. ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఐటీ నోటీసులు వచ్చాయి. ఈడీ అటాచ్ మెంట్ జరిగింది. ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ లో అరెస్ట్ అయ్యారు.
అవినీతి అంతా బయటకు వస్తే చంద్రబాబు కచ్చితంగా బయటకి రాడు. ఈ విషయం నేను చాలా రోజుల నుంచి చెబుతున్నా. ఎప్పుడైతే సింగపూర్ లో మంత్రి ఈశ్వరన్ అరెస్ట్ అయ్యారో అతడితో చేరి అమరావతిలో దోచుకున్న చంద్రబాబు కూడా తొందరలోనే అరెస్ట్ కాబోతున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు శుభవార్త వినే రోజు వస్తుందని నేను చెప్పి నెల రోజులు కూడా కాలేదు. అంతలో ఇలా జరిగింది. జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు భగవంతుడు ఉన్నాడు. తప్పు చేసిన వారు ఎవరూ భగవంతుడి నుంచి తప్పించుకోలేరు. దేవుడు ఉన్నాడు.
Also Read..Vijayasai Reddy : చంద్రబాబు ఇక జీవితాంతం జైల్లోనే- విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కోర్టు హాల్ లో మొత్తం లాయర్లతో నింపేశారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు తెలుగుదేశం లాయర్లు అంతా దూరి నాన్ సెన్స్ చేస్తుంటే మీరంతా బయటకు వెళ్లకపోతే నేను తీర్పు చదవను అని జడ్జి రెండు సార్లు చెప్పడాన్ని గమనించాలి. అంటే, ప్రతిసారి కూడా ఏదో ఒక భయబ్రాంతులకు గురి చేశో, టెక్నికల్ గా చూపించి మేమే తెలివైన వాళ్లం అని చెప్పి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేశారు. అక్రమ కేసులు పెట్టి జగన్ ని లోపల పెట్టిన చంద్రబాబు నాయుడు ఈరోజు సాక్ష్యాధారాలతో దొరికి లోపలికి వెళ్తున్నారు.
ఆ రోజు జగన్ ని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర ప్రజలు బాధపడ్డారు. తప్పు చేయని వ్యక్తిని, ముఖ్యమంత్రిగా లేడు, కేబినెట్ లో లేడు. అలాంటి వ్యక్తిని కేవలం తండ్రి లేని సమయం చూసి అతడిని రాజకీయంగా తొక్కేయాలన్న ప్రయత్నం అందరూ కలిసి చేశారు. తాను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా పోరాడి ప్రజల ఆశీస్సులతో జగన్ బయటకు వచ్చారు, తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారు” అని మంత్రి
రోజా అన్నారు.