IND vs AUS 1st T20 : దంచికొట్టిన సూర్యకుమార్, ఇషాన్ కిషన్.. తొలి టీ20లో ఆస్ట్రేలియా పై భారత్ విజయం
India vs Australia, 1st T20 : విశాఖ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచులో భారత జట్టు విజయం సాధించింది.
విశాఖ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచులో భారత జట్టు విజయం సాధించింది. 209 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 19.5 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది.. దీంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (80; 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (58; 39 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. యశస్వి జైస్వాల్ (21; 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), రింకూ సింగ్(22 నాటౌట్) రాణించారు. ఆసీస్ బౌలర్లలో తన్వీర్ సంఘ రెండు వికెట్లు తీశాడు. మాథ్యూ షార్ట్, జాసన్ బెహ్రెండోర్ఫ్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ (110; 50 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లు) ఫాస్టెస్ట్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. స్టీవ్ స్మిత్ (52; 41 బంతుల్లో 8 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో రవిబిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో వికెట్ తీశారు.
Rahul Dravid : ఇంకో ఏడాదా..? అస్సలు వద్దు.. టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ ఎవరో తెలుసా..?
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆసీస్కు మాథ్యూ షార్ట్(13), స్టీవ్ స్మిత్ లు 4.4 ఓవర్లలోనే 31 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. రవి బిష్ణోయ్ తన మొదటి ఓవర్లోనే షార్ట్ను ఔట్ చేయడం ద్వారా మొదటి వికెట్ పడగొట్టాడు. వన్డౌన్లో వచ్చిన జోష్ ఇంగ్లిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీల వర్షం కురిపించాడు. సిక్సర్లు, ఫోర్లతో భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడికి స్టీవ్స్మిత్ చక్కని సహకారం అందించాడు.
ఈ క్రమంలో జోష్ ఇంగ్లిస్ 47 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20 క్రికెట్లో అతడికి ఇదే మొదటి సెంచరీ కావడం గమనార్హం. శతకం బాదిన తరువాత మరింత ధాటిగా ఆడే క్రమంలో అతడు ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. మరోవైపు తనదైన శైలిలో ఆడిన స్టీవ్స్మిత్ 40 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే రనౌట్ అయ్యాడు. ఆఖర్లో టిమ్డేవిడ్ (19 నాటౌట్; 13 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఆసీస్ స్కోరు రెండొందలు దాటింది.