IND vs ENG : టెస్టు మ్యాచ్ మధ్యలో వెళ్లిపోయిన అశ్విన్.. అతడి స్థానంలో అక్షర్ ఆడొచ్చా? నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే?
రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ నుంచి టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా తప్పుకున్నాడు.
IND vs ENG 3rd Test : రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ నుంచి టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా తప్పుకున్నాడు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా రెండో రోజు ఆట ముగిసిన తరువాత అతడు రాజ్కోట్ నుంచి చెన్నై పయనమైనట్లు బీసీసీఐ తెలిపింది. అతడి తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, ఈ సమయంలో అతడు తన తల్లితో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాడని, ఇలాంటి కఠిన సమయాల్లో అతడికి అండగా ఉంటామని, అతడి గోపత్యకు గౌరవం ఇవ్వాలని చెప్పింది.
అశ్విన్ వెళ్లిపోవడంతో ఇప్పుడు భారత జట్టుకు సమస్యగా మారింది. నలుగురు ప్రధాన బౌలర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అయితే.. అశ్విన్ స్థానంలో మరో బౌలర్ను తీసుకునే అవకాశం ఉందా..? అనే ప్రశ్నను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. కంకషన్ రూల్లా ఏమైనా రూల్ ఉందా అని నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఎంసీసీ నిబంధనల ప్రకారం అశ్విన్ స్థానంలో మరొక ఆటగాడిని తీసుకునేందుకు వీలు లేదు. అయితే.. సబ్స్టిట్యూట్ ఫీల్డర్కు మాత్రం అంపైర్లు అనుమతి ఇస్తారు.
స్లిప్లో జైస్వాల్ స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్
ఆటగాడు గాయపడడం, లేదా అస్వస్థతకు లోనైన సందర్భాల్లో మాత్రమే మరో ఆటగాడిని తీసుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో అశ్విన్ గాయపడడం గానీ, అస్వస్థతకు లోను కాలేదు. కాబట్టి సబ్స్టిట్యూట్ ఫీల్డర్ను మాత్రమే అనుమతి ఉంది. సబ్స్టిట్యూట్ ఫీల్డర్ బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేయడానికి అనుమతి లేదు. కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేస్తాడు. ప్రత్యేక సందర్భాల్లో అంపైర్ల అనుమతితో వికెట్ కీపింగ్ కూడా చేయొచ్చు.