వంద రోజుల డెడ్లైన్ ముగిసింది..ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి? : బండి సంజయ్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది.. మరి మహిళలకు ప్రతి నెల రూ. 2500 ఎందుకు జమ చేయడం లేదని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
![వంద రోజుల డెడ్లైన్ ముగిసింది..ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి? : బండి సంజయ్ వంద రోజుల డెడ్లైన్ ముగిసింది..ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి? : బండి సంజయ్](https://10tv.in/wp-content/uploads/2024/03/Bandi-Sanjay.jpg)
Bandi Sanjay
Bandi Sanjay Kumar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు ముగిసినా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. వంద రోజులు డెడ్ లైన్ అన్నారు.. మీరిచ్చిన డెడ్ లైన్ ముగిసింది.. మరి ఆరు గ్యారంటీలను ఎందుకు అమలు చేయలేదు అంటూ సీఎం రేవంత్ రెడ్డిని సంజయ్ ప్రశ్నించారు. మీరు మాటిచ్చిన ప్రకారం హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పి తీరాల్సిందేనని అన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది.. మరి మహిళలకు ప్రతి నెల రూ. 2500 ఎందుకు జమ చేయడం లేదు? రైతు భరోసా రూ.15 వేలు ఎందుకివ్వలేదు? ఫించన్ రూ.4 వేలు ఎందుకు అమలు చేయలేదు? విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఎందుకియ్యలేదు? గ్యాస్ సబ్సిడీ, రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అమల్లోనూ కోత పెడతారా? ఇండ్లు కట్టిస్తున్నట్లు షో చేయడమే తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమిటి? అంటూ బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
Also Read : Lok Sabha Election 2024 : రేపే లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్.. ప్రకటించిన ఈసీ
బీఆర్ఎస్ హయాంలో చేసిన మోసాలు అన్నీఇన్నీ కావు.. ఒక్క బైక్ పై 126 గొర్రెలు ఎక్కించినట్లు రూ. కోట్లు వసూలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ వాళ్లదంటూ సంజయ్ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ది చెప్పండి అంటూ బండి సంజయ్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు.