నామినేటెడ్‌ పదవులు దక్కేది వీరికే? పదవుల భర్తీకి సీఎం చంద్రబాబు సరికొత్త పంథా

యువనేత లోకేశ్‌ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అధినేత వెంట పడుతూ... సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయడం ద్వారా పార్టీ నేతలను ప్రోత్సహించాలని కోరుతున్నారట.

నామినేటెడ్‌ పదవులు దక్కేది వీరికే? పదవుల భర్తీకి సీఎం చంద్రబాబు సరికొత్త పంథా

Gossip Garage : వందల్లో పదవులు… వేలల్లో ఆశావహులు.. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత వచ్చిన అవకాశం… అధినేత మనసులో ఏముంది…? యువనేత అండదండలు ఎవరికి…? ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా? కష్టపడి పనిచేసిన వారిని అందలమెక్కిస్తారా? నామినేటెడ్‌ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది…? టీడీపీలో నామినేడెట్‌ పదవుల సందడి మొదలైంది… అధినేత ఆశీస్సులతో పదవులు దక్కించుకోబోతున్న నేతలు ఎవరు?

ముఖ్యమైన ఆలయాలతో పాటు 25 ప్రధాన కార్పొరేషన్ చైర్మన్‌ పదవుల భర్తీ..
ఈ నెలాఖరులోగా నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తారనే టాక్‌తో ఏపీ టీడీపీలో సందడి కనిపిస్తోంది. దాదాపు వందకు పైగా కార్పొరేషన్ల చైర్మన్‌ పదవులతోపాటు టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం, శ్రీకాళహస్తి వంటి ప్రధాన ఆలయాలకు చైర్మన్‌లను నియమించాల్సి వుంది. వీటితోపాటు ఆయా కార్పొరేషన్లు, ఆలయాల్లో డైరెక్టర్‌ పదవులు ఉంటాయి. అంతేకాకుండా జిల్లాస్థాయిలోనూ చాలా పదవులను నామినేట్‌ చేస్తుంటారు. ఐతే ప్రస్తుతం తొలి విడతగా ముఖ్యమైన ఆలయాలతోపాటు 25 ప్రధాన కార్పొరేషన్ చైర్మన్‌ పదవులను భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. నామినేటెడ్‌ పదవుల్లో మిత్రపక్షాలు జనసేన, బీజేపీలకు కొన్ని ఇవ్వాల్సి ఉన్నందున… టీడీపీ కోటా పదవులకు తీవ్ర పోటీ ఉంది.

గత ఐదేళ్లు ఇబ్బందులు పడ్డ వారికి ప్రాముఖ్యత..
గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి టీడీపీలో నామినేటెడ్‌ పదవుల భర్తీకి చంద్రబాబు కొత్త పంథా అనుసరిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయడం వల్ల 31 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించారు. ఆ సీట్లను ఆశించిన నేతలకు నామినేటెడ్‌ పదవులు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అదేవిధంగా గత ఐదేళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్న నేతలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వుంది.

లోకేశ్ పాదయాత్రలో పోలీస్ కేసులు ఎదుర్కొన్న నేతలకు ప్రాధాన్యం..
ఎన్నికలకు ముందు యువనేత లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో పోలీసు కేసులు ఎదుర్కొన్న నేతలకు పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత మంచి పదవని ఆఫర్‌ ఇచ్చారు. లోకేశ్‌ హామీతోపాటు చంద్రబాబు సైతం ప్రతిపక్షంలో పోరాటపటిమ చూపిన నేతలకు ప్రాధాన్యం ఇస్తామని చాలాసార్లు ప్రకటించారు. యువనేతతోపాటు అధినేత కూడా పలువురు నేతలకు హామీలిచ్చారు. దీంతో ఇప్పుడు తొలి విడతలోనే తమకు పదవులు వస్తాయని ఆశిస్తున్న నేతల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.

ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన త్యాగరాజులకు ప్రాధాన్యం..
ఈ నెలాఖరులోగా భర్తీ చేయనున్న కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులకు లిస్టు రెడీ అవుతోందని టీడీపీ వర్గాల సమాచారం. ఐతే ఇందులో ఎవరిరెవరి పేరు ఉంటుందనే ఉత్కంఠ పార్టీ శ్రేణులకు నిద్రపట్టనీయడం లేదు. ముఖ్యంగా ఎన్నికల్లో సీటు త్యాగం చేసిన త్యాగరాజులకు ముందుగా ప్రాధాన్యమివ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. ఎమ్మెల్యే, ఎంపీ పదవులపై ఆశతో గత ఐదేళ్లుగా నియోజకవర్గాల్లో కష్టపడిన నేతలు ఎందరో చివరి నిమిషంలో అధినేత నిర్ణయంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

ఇటువంటి వారిలో సీనియర్‌ నేతలు దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, గుంటూరు నగరానికి చెందిన కోవెలమూడి రవీంద్ర, బుద్ధా వెంకన్న, విశాఖ నగరానికి చెందిన గండి బాబ్జీ, కాకినాడ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వంటివారు ఉన్నారు.

పదవులు ఆశిస్తున్న టికెట్ దక్కని నేతలు..
వీరిలో కొందరికి ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చారు. ఐతే ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకటి జనసేనకు కేటాయించగా, ఇంకొకటి కొత్తగా పార్టీలోకి వచ్చిన సి రామచంద్రయ్యకు కేటాయించారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పార్టీలో చేరిన ఇక్బాల్‌తోపాటు గురజాల నియోజకవర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి వంటి వారికి అవకాశం ఇవ్వాల్సి వుంది. వీరితోపాటు ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని పలువురు నేతలు నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్నారు.

ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని వారికే తొలి ఇంపార్టెన్స్..
ఐదేళ్లు పార్టీ కోసం కష్టపడిన అధికార ప్రతినిధి పట్టాభి, ఎన్నికల్లో పోటీకి తొలుత టికెట్‌ పొంది… బీజేపీతో పొత్తులో భాగంగా టికెట్‌ కోల్పోయిన అరకు టీడీపీ నేత దున్ను దొర, మాజీ మంత్రి కాడారి శ్రవణ్‌, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వంటి వారు నామినేటెడ్‌ పదవులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో పోటీకి అవకాశం దక్కని వారికే తొలి ప్రాధాన్యం అంటే… ముందుగా జనసేన, బీజేపీకి కేటాయించిన 31 నియోజకవర్గ నేతలే కనిపిస్తున్నారు. ఐతే వీరిలో అందరికీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులిచ్చే అవకాశం లేదని టాక్‌ వినిపిస్తోంది. కొందరిని ఎమ్మెల్సీలుగా పంపే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్‌ పదవులను భర్తీకి లోకేశ్ ఒత్తిడి..
ముఖ్యంగా పార్టీకి విధేయంగా పని చేసిన వారిని గుర్తించడం ముఖ్యమన్నట్లు చంద్రబాబు సమాచారం సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి నామినేటెడ్‌ పదవుల విషయంలో చంద్రబాబు ఎప్పుడూ ఇంత త్వరగా నిర్ణయం తీసుకోలేదు. కానీ, యువనేత లోకేశ్‌ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా అధినేత వెంట పడుతూ… సాధ్యమైనంత త్వరగా నామినేటెడ్‌ పదవులను భర్తీ చేయడం ద్వారా పార్టీ నేతలను ప్రోత్సహించాలని కోరుతున్నారట. దీంతో ఈ నెలాఖరులోగా ముఖ్యమైన పదవులకు నియామకాలు పూర్తిచేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Also Read : మళ్లీ టీడీపీలోకి వచ్చేస్తామంటున్న మాజీ తెలుగుదేశం నేతలు..! ఎవరా నాయకులు? కారణమేంటి?