YSRCPలో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు.. అహంకారమే మీ పతనానికి కారణం: జగన్‌పై షర్మిల ఫైర్

YSRCPలో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు కదా.. ఇప్పుడు ఉన్నది కేవలం Y అంటే వైవీ సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే.

YSRCPలో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు.. అహంకారమే మీ పతనానికి కారణం: జగన్‌పై షర్మిల ఫైర్

YS Sharmila Fire on YS Jagan : తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అహంకారంతోనే పతనమయ్యారని ఎక్స్ (ట్విటర్)లో మండిపడ్డారు. ”అసెంబ్లీకి వచ్చి చంద్రబాబును నిలదీయండి అంటే మీకు నేను చంద్రబాబుకు కొమ్ము కాసినట్లు ఉందా అని ప్రశ్నించారు.మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. అద్దంలో చూసుకోమని చెప్పింది అందుకే.. మీకు చంద్రబాబు పిచ్చి పట్టుకుంది. అద్దంలో మీకు ఇప్పుడు కూడా చంద్రబాబే కనపడబడుతున్నాడు. సోషల్ మీడియాలో నన్ను కించపర్చేంత ద్వేషం మీకు ఉంది. మాకు ద్వేషం లేదు. కానీ తప్పును తప్పు అని చెప్పే ధైర్యం ఉంది.

ఒక ప్రతిపక్షం మరో ప్రతిపక్షాన్ని ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? తప్పు చేస్తే ఏ పార్టీనైనా ప్రశ్నించే అధికారం మాకు ఉంది. అది అధికార పార్టీనా.. లేక ప్రతిపక్షమా అన్నది ముఖ్యం కాదు. జగన్ మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకపోవడం తప్పు! కాబట్టే తప్పు అన్నాం! చట్ట సభను గౌరవించకపోవడం తప్పు! కాబట్టే రాజీనామా చేయమన్నాం!వైఎస్సార్ విగ్రహాలు కూల్చేస్తే నేనే స్వయంగా అక్కడికి వచ్చి ధర్నా చేస్తానని అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలను హెచ్చరించింది నేనే. అసలు మీరు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ విగ్రహాలు కూల్చకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చకపోయి ఉంటే ఈరోజు వైఎస్సార్ కి ఇంత అవమానం జరిగి ఉండేది కాదు.

Also Read: ఆంధ్రప్రదేశ్ వలంటీర్లలో చిగురిస్తున్న కొత్త ఆశలు.. త్వరలో వలంటీర్ల వ్యవస్థపై నిర్ణయం!

అసలు వైసీపీలో వైఎస్సార్ గారిని, విజయమ్మను అవమానించినవారే కదా పెద్ద వాళ్లు. YSRCPలో YSRని ఎప్పుడో వెళ్లగొట్టారు కదా.. ఇప్పుడు ఉన్నది కేవలం Y అంటే వైవీ సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి, R అంటే రామకృష్ణారెడ్డి మాత్రమే. కనుక వైఎస్సార్ లాగా అసెంబ్లీలో పోరాడటం మీకు చేత కాదులే.. మీకు మీడియా పాయింటే ఎక్కువ. మీరు మాట్లాడుతున్న పక్క రాష్ట్రం తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసినందుకు గర్వపడుతున్నాం. మరి మీరు రైతులను నిలువునా మోసం చేసింది నిజం కాదా?

Also Read: జగనన్న పథకాల పేర్లు మారాయ్.. కొత్త పేర్లు ఏంటో తెలుసా? పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

3 వేల కోట్లతో ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి అన్నారు. 4 వేల కోట్లతో ప్రతి ఏడాది పంట నష్ట పరిహారం అన్నారు. ఇక వైఎస్సార్ జలయజ్ఞం పథకానికి తూట్లు పొడిచారు. మద్యపాన నిషేధం అని దగా చేశారు. మీ కంటే మోసగాళ్లు.. విశ్వసనీయత కోల్పోయిన వాళ్లు ఉంటారా..? మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం శరీరంలో అణువుణువునా పిరికితనం పెట్టుకున్న మీరు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను, వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి, తాకట్టుపెట్టారు. మీ అహంకారమే మీ పతనానికి కారణమ”ని వైఎస్ షర్మిల విమర్శించారు.