కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన ఆ ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరే?

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లకు రేపో మాపో కండువా కప్పేందుకు రెడీ అవుతున్నారు హస్తం పార్టీ లీడర్లు.

కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన ఆ ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరే?

Gossip Garage : అధికార పార్టీ రా రమ్మంటోంది.. కారు దిగాలంటే అనర్హత అంశం గుబులు రేపుతోంది. వాస్తవానికి బీఆర్ఎస్ విలీనానికి స్కెచ్ వేసింది కాంగ్రెస్. కానీ గులాబీ కండువా మార్చాలంటే ఆలోచిస్తున్నారు ఎమ్మెల్యేలు. ఎంత ట్రై చేసినా బీఆర్ఎస్ ఎల్పీ విలీనం అయ్యే పరిస్థితులేవీ కనిపించడం లేదు. దీంతో జరిగింది ఏదో జరిగిపోయింది.. ఇక ఎంతమంది వస్తే అంతమందిని చేర్చుకుందామని కాంగ్రెస్ ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరో ఐదారుగురు కారు పార్టీ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లింది కాంగ్రెస్ పార్టీ. ఇంతకీ హస్తం గూటికి చేరేందుకు రెడీ అయిన ఆ ఎమ్మెల్యేలు ఎవరు? కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ 2.Oలో చిక్కింది ఎవరు?

కాంగ్రెస్ తో టచ్ లో మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..!
లోక్ సభ ఎన్నికలు ముగిశాయి. సీఎం అమెరికా టూర్ అయిపోయింది. రాజ్యసభ ఎన్నికా పూర్తయింది. ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలే కాంగ్రెస్ టార్గెట్. అందుకే ఆపరేషన్ ఆకర్ష్ 2.Oకు స్కెచ్ వేస్తోంది కాంగ్రెస్. కారు పార్టీ దాడి రోజురోజుకు పెరిగిపోతుండటంతో.. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. వీరు కారు దిగేస్తే అది స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ అవుతుందన్నది కాంగ్రెస్ వ్యూహం. దానం నాగేందర్ తో పాటు ఇప్పటికే 10 మంది కారు పార్టీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. ఇంకా 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరితే BRSLP విలీనం అవుతుంది.

రేపో మాపో కాంగ్రెస్ గూటికి..
అయితే అంతమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరేందుకు రెడీగా లేకపోవడంతో.. రూట్ మార్చింది కాంగ్రెస్. ఎంతమంది వస్తే అంతమందిని చేర్చుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లకు రేపో మాపో కండువా కప్పేందుకు రెడీ అవుతున్నారు హస్తం పార్టీ లీడర్లు. వీరితో పాటు మరికొందరితోనూ చర్చలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ఎమ్మెల్యేలెవరన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

నలుగురిలో ముగ్గురి చేరికకు గ్రీన్ సిగ్నల్…
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఆలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు, బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందులో ముగ్గురిని చేర్చుకునేందుకు హస్తం పార్టీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఆ ఎమ్మెల్యేపై పలు ఆరోపణలు ఉండటంతో.. కండువా కప్పాలా వద్దా అని కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జహీరాబాద్, ఆలంపూర్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు.. అడ్డంకులు ఏర్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాణిక్ రావు చేరికను.. జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ వ్యతిరేకిస్తుట్లు తెలుస్తోంది. ఆయన స్థానికుడు కాకపోవడంతో పెద్దగా ఇబ్బంది ఉండదని హస్తం పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఆలంపూర్ లో మాత్రం మాజీ ఎమ్మెల్యే సంపత్.. విజేయుడు చేరికపై తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నట్లు టాక్.

డోర్లు తెరిస్తే చాలు అందరూ వచ్చేస్తారునుకున్నారు..
పవర్ లో ఉన్నాం.. డోర్లు తెరిస్తే చాలు అందరూ వచ్చేస్తారునుకున్నారు. స్టార్టింగ్ లో పరిస్థితి కూడా అలానే కనిపించింది. గులాబీ పార్టీలో ఆ ముగ్గురే మిగులుతారన్న కాంగ్రెస్ నేతల మాటలు నిజమైతాయేమోనన్న సిచ్యువేషన్ కూడా కనిపించింది. కానీ సీన్ మారింది. మొదట్లో అధికార పార్టీలోకి వెళ్లేందుకు చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపించారు. కొందరు ఓ స్టెప్ ముందుకేసి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. ఇందులో చాలామంది బీఆర్ఎస్ ఎల్పీ విలీనం ఖాయమనే నమ్మకంతో క్యూలో ముందుండాలనే కారు దిగారని తెలుస్తోంది.

Also Read : నెక్ట్స్.. బీఆర్ఎస్ నేతల ఫామ్‌హౌస్‌లు కూలుస్తారా..? హైడ్రా అసలు టార్గెట్ అదేనా?

రేవంత్ స్కెచ్ ఇప్పటికిప్పుడు వర్కౌట్ అయ్యేలా లేదు..
కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ న్యాయపోరాటం చేస్తోంది. దానం నాగేందర్ పై అనర్హత వేటు పడేలా చేసి ఉపఎన్నిక వచ్చేలా స్కెచ్ వేస్తోంది. ఇదే ఇప్పుడు జంపింగ్ జపాంగ్స్ కు టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే వెళ్లిన ఎమ్మెల్యేలకు అనర్హత భయం వెంటాడుతుండటంతో.. కొత్తగా కాంగ్రెస్ లో చేరాలనుకునే ఎమ్మెల్యేలు పార్టీ మారాలనే ఆలోచననే మానుకున్నట్లు తెలుస్తోంది. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా CLP విలీనానికి కౌంటర్ గా BRSLPని విలీనం చేసుకుని కేసీఆర్ కు షాక్ ఇవ్వాలనుకున్న రేవంత్ స్కెచ్ ఇప్పటికిప్పుడు వర్కౌట్ అయ్యేలా కన్పించడం లేదు.