తెలంగాణ విద్యా కమిషన్ పదవి ఎవరిని వరిస్తుంది? రేసులో ఆ నలుగురు..!

ఎన్నికల ముందు రకరకాల పార్టీల్లో చేరతారని ప్రచారం జరిగినా, సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా మెలిగారని చెబుతారు. దాదాపు ఆయనకు కమిషన్ చైర్మన్‌గా నియమించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు.

తెలంగాణ విద్యా కమిషన్ పదవి ఎవరిని వరిస్తుంది? రేసులో ఆ నలుగురు..!

Gossip Garage : తెలంగాణలో విద్యా కమిషన్ రేస్ మొదలైంది. ప్రాథమిక విద్య ప్రమాణాలు పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిషన్ లో చైర్మన్‌తోపాటు ముగ్గురు సభ్యులు ఉంటారు. రాజ్యాంగ బద్ధమైన చైర్మన్ పదవికి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. దీంతో చాలా మంది తెలంగాణా విద్యావేత్తలు ఈ పదవిపై కన్నేశారు. అటు ప్రభుత్వం కూడా పలువురు మాజీ ఐఏఎస్ అధికారులతో పాటు, కొందరు ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నవారెవరు.. తెలంగాణ విద్యా వ్యవస్థను గాడిన వేసే వారెవరు.

రేసులో మురళి, హరగోపాల్, నాగేశ్వర్, కోదండరామ్..
తెలంగాణ విద్యా కమిషన్ పదవి ఎవరి వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర క్యాబినెట్ మంత్రి హోదాతోపాటు, రాజ్యాంగ బద్ధమైన అధికారాలు ఉండటంతో విద్యా కమిషన్ చైర్మన్ పోస్టుకు చాలా క్రేజ్ ఏర్పడింది. దీనిపై చాలా మంది ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం కమిషన్ ను ఏర్పాటు చేయగా, ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగా పనిచేసే వారి కోసం అన్వేషిస్తోంది. దీంతో పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళితోపాటు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రధాన పోటీదారులుగా చెబుతున్నారు. వీరితోపాటు తెలంగాణ జనసమితి అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం కూడా రేసులో ఉన్నట్లు చెబుతున్నారు.

వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేయడం వల్ల విమర్శలు వచ్చే అవకాశం..
కమిషన్ చైర్‌ పర్సన్ పదవిని ఆశిస్తున్న నలుగురిలో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తుండగా, మరో ఇద్దరు తటస్థులు. విద్యావేత్తల కోటాలో చైర్మన్ గిరీని కోరుకుంటున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఆకునూరి మురళి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా పనిచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో విభేదించి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో విద్యారంగ సలహాదారుగా పనిచేశారు. అక్కడ నాడు-నేడు మనబడి కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారనే పేరుంది.

అయితే ఏవో విబేధాల కారణంగా ఏపీలో సలహాదారు పదవిని సైతం మధ్యలోనే వదిలేశారు ఆకునూరి మురళి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్న మురళిని కమిషన్ చైర్మన్‌గా నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు. ఇదే సమయంలో ఆయన పక్క రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేయడం వల్ల విమర్శలు వచ్చే అవకాశం ఉందని వెనక్కి తగ్గుతున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది.

ఆకునూరి మురళి పేరు దాదాపు ఖరారు..!
తెలంగాణకు చెందిన ఆకునూరి మురళి ఉద్యోగ విరమణ తర్వాత రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించారు. ఎన్నికల ముందు రకరకాల పార్టీల్లో చేరతారని ప్రచారం జరిగినా, సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితంగా మెలిగారని చెబుతారు. దాదాపు ఆయనకు కమిషన్ చైర్మన్‌గా నియమించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు. ఇదే సమయంలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్లు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

రేసులో విద్యావేత్త హరగోపాల్, ప్రొ.నాగేశ్వర్..
తెలంగాణ సమాజంలో మంచి గుర్తింపు ఉన్న విద్యావేత్త హరగోపాల్‌ ను చైర్మన్ చేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కాంగ్రెస్‌లో ఓ వర్గం వాదనగా ఉంది. ఆయన కాదంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ పేరు పరిశీలించాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్‌కూ సీఎం రేవంత్‌రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. రెండు సార్లు ఎమ్మెల్సీగా పని చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు తెలంగాణపై విస్తృత అవగాహన ఉంది. అంతేకాకుండా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ నాగేశ్వర్, సీఎం రేవంత్‌రెడ్డి పలు విషయాల్లో కలిసి పని చేశారంటున్నారు. పలు సందర్భాల్లో నాగేశ్వర్ లాంటి వారి సేవలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వినియోగించుకుంటామంటూ పీసీసీ చీఫ్ హోదాలోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యమూ ఉంది.. అంతేకాకుండా ఇటీవల హైడ్రా ఏర్పాటు నేపథ్యంలో బహిరంగంగానే రేవంత్ కు నాగేశ్వర్ కితాబు ఇచ్చారు. దీంతో నాగేశ్వర్‌కు కూడా చాన్స్ ఉందంటున్నారు.

మరోవైపు ప్రొఫెసర్ కోదండరాం పేరు కూడా పరిశీలిస్తున్నారంటున్నారు. తెలంగాణ ఉద్యమ జేఏసీ కన్వీనర్‌గా ప్రత్యేక రాష్ట్రసాధనలో కీలక భూమిక పోషించిన కోదండరామ్‌ను రాజకీయంగా వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీఆర్ఎస్‌ నుంచి ఉద్యమకారులను దూరం చేయాలంటే కోదండరామ్ సేవలు వినియోగించుకోవాలనేది హస్తం పార్టీ ఆలోచనగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో కోదండామ్ మద్దతు తీసుకుని, ఆయనకు హామీ ఇచ్చిన విధంగా ఎమ్మెల్సీ చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో తీసుకుని విద్యా మంత్రిగా నియమించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌లోనే మంత్రి పదవులకు విపరీతమైన పోటీ ఉండటంతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. దీంతో ప్రొఫెసర్ కూడా అయిన కోదండరాంను క్యాబినెట్ హోదా ఉండే విద్యా కమిషన్ చైర్మన్ పదవినైనా ఇస్తే బాగుంటుందని ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు.

Also Read : కాంగ్రెస్‌లో కలకలం రేపిన ఎమ్మెల్యే వేముల వీరేశం.. చిన్న విషయానికే అంత సీరియస్‌ ఎందుకయ్యారు?

ఐతే ఎమ్మెల్సీగా ఉన్నవారికి రాజ్యంగ హోదా ఉండే చైర్మన్ పదవిలో నియమించడానికి నిబంధనలు అడ్డొస్తాయని అంటున్నారు. ఇందుకోసం చట్ట సవరణ చేయాల్సి వుంటుంది. దీంతో కోదండరామ్ నియామకంపై తర్జనభర్జన సాగుతోంది. దీంతో రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ప్రొఫెసర్లు హరగోపాల్, నాగేశ్వర్ మధ్యే పోటీ ఉందంటున్నారు.