ఇసుక పాలసీ, మైనింగ్ అధికారులకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు

జగన్ సీఎం అయ్యాక కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇసుక మైనింగ్, రవాణా, విక్రయాల్లో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సీఎం జగన్ కొత్త పాలసీ రూపొందించారు. తాజాగా నూతన ఇసుక పాలసీని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

ఇసుక పాలసీ, మైనింగ్ అధికారులకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు

జగన్ సీఎం అయ్యాక కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇసుక మైనింగ్, రవాణా, విక్రయాల్లో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సీఎం జగన్ కొత్త పాలసీ రూపొందించారు. తాజాగా నూతన ఇసుక పాలసీని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనింగ్ అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఇసుక పర్యవేక్షణాధికారులు (డీఎస్ఓ)గా మైనింగ్ అధికారులు నియమిస్తున్నట్లు రాష్ట్ర భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఈ బాధ్యతలను అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పర్యవేక్షించారు. ఇసుక పాలసీలో పారదర్శకతను మరింత పెంచడానికి కీలకమైన ఈ స్థానాల్లో పూర్తి స్థాయి మైనింగ్ అధికారులను నియమించినట్లు మంత్రి వివరించారు.

ఏడీ, డీడీ స్థాయి అధికారుల నియామకంతో జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం భావించినట్లు మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ఏపీఎండీసీ, మైనింగ్ శాఖల మధ్య సమన్వయంతో ఇసుక విక్రయాల్లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఇసుక మైనింగ్, రవాణా, విక్రయాల్లో అక్రమాలకు అవకాశం లేకుండా పక్కా ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇసుక ధర భారీగా తగ్గించేలా ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొచ్చింది.

ఇకపై ఆన్‌లైన్ లో ఇసుక బుకింగ్.. జీపీఎస్ అమర్చిన వాహనాల ద్వారా ఇసుక తరలిస్తారు. ఏపీఎండీసీ ఆధ్వర్యంలో రీచ్‌ల నుంచి ఇసుకను స్టాక్‌ యార్డులకు తరలించి అమ్మకాలు జరుపుతారు. రీచ్‌ల దగ్గర టన్ను ఇసుక ధర రూ.375గా నిర్ణయించారు. వ్యవసాయ భూముల్లోని ఇసుక నిక్షేపాలను క్యూబిక్ మీటర్ రూ.60 చొప్పున కొనుగోలు చేయనున్నారు. ఇసుక స్టాక్ యార్డులు పెట్టుకోవడానికి ఎవరికీ అనుమతి లేదు.

ఇతర రాష్ట్రాలకు ఇసుక రవాణా చేయం నిషేధం. ఇసుకకు సంబంధించిన నగదు చెల్లింపు కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఇసుక రవాణా ఛార్జీలను నిర్ణయించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది ప్రభుత్వం. నిబంధనల్ని వ్యతిరేకించి జీపీఎస్‌ లేకుండా ఇసుక తరలిస్తే జరిమానాల మోత తప్పదు. ఇసుక రీచ్‌లు, స్టాక్‌ యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఇసుక పాలసీని రూపొందించామంటోంది ప్రభుత్వం.