Thirumala : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమైంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించడానికి టీటీడీ సన్నాహాలు పూర్తి చేసింది.
Thirumala Srivari Brahmotsavalu : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమైంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించడానికి టీటీడీ సన్నాహాలు పూర్తి చేసింది. ఇవాళ సాయంత్రం వెంకన్న సన్నిధిలో శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది.
కరోనా కారణంగా శ్రీవారి బ్రహ్మత్సోవాలను ఈ ఏడాది కూడా ఆలయానికే పరిమితం చేసింది టీటీడీ. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు ఉత్సవాలను వరుసగా రెండో ఏడాది కూడా ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. రేపు సాయంత్రం జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభం కానున్నాయి.
TTD : ఈ నెల 7న తిరుమల వీఐపీ దర్శనం రద్దు
మొదటిరోజు రాత్రి స్వామివారు పెద్ద శేష వాహనంపై భక్తులకు దర్శనం ఇస్తారు. 11వ తేదీన ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడసేవ జరగనుంది. గరుడసేవ రోజున స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం జగన్ రాక సందర్భంగా తిరుమల, తిరుపతిలో పోలీసు అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజున సీఎం చేత పలు ప్రారంభోత్సవాలకు టీటీడీ సన్నాహాలు చేస్తోంది.
మరోవైపు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేషన్ లేదా.. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ను టీటీడీ తప్పనిసరి చేసింది. ఈ రెండు లేనివారిని శ్రీవారి దర్శనానికి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.