Andhra Pradesh: అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

అగ్రవర్ణాల్లో పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు..  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం

Ap Govt

Andhra Pradesh: అగ్రవర్ణాల్లో పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అంగీకరిస్తూ, చట్టాన్ని అమల్లోకి తీసుకుని వచ్చే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ రిజర్వేషన్లకు సంబంధించి బుధవారం(14 జులై 2021) అర్థరాత్రి జీఓ (ఎంఎస్ నంబర్ 66/2021)ను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నిర్ణయంతో ఏపీలో ఉన్న అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. సీట్లలో మూడో వంతు ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద 10 శాతం రిజర్వేషన్ అమలు చేయనుండగా.. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి రిజర్వేషన్లు వర్తించేలా ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం.

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు వర్తింపచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించగా.. వార్షిక ఆదాయం రూ. 8లక్షల లోపు ఉన్న అగ్ర వర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేసే ప్రతిపాదనకు జనవరి 2019లోనే కేబినెట్ ఆమోదం తెలిపింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 లను అనుసరించి సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో రిజర్వేషన్లు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది కేంద్రం.

ప్రభుత్వం లేటెస్ట్‌గా తీసుకున్న నిర్ణయంతో అగ్రవర్ణాల్లోని పేదలకు మేలు జరగనుంది. మరోవైపు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయ పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. గతంలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా మెమో జారీ చేసింది. రూ.8 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి ఓబీసీ సర్టిఫికెట్లు జారీచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో అగ్రవర్ణాల్లోని బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ, వైశ్య, కాపు, క్షత్రియ కులాల్లోని పేదలకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది.