Executive Capital Visakha : ఎగ్జిక్యూటివ్ కేపిటల్ విశాఖపై ఏపీ సర్కార్ ఫోకస్
విశాఖపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉక్కు నగరానికి మరిన్ని హంగులు అద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది.
AP Government Focus on Visakha : విశాఖపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉక్కు నగరానికి మరిన్ని హంగులు అద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఎక్కడా తేడా రాకుండా.. రాజధాని మరింత అభివృద్ధి చెందేలా ప్లాన్ ప్రిపేర్ చేస్తోంది. మరి ప్రభుత్వం స్పెషల్ ఫోకస్లో ఏమేమున్నాయి? విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. దానిపై ఫుల్ ఫోకస్ పెట్టింది. వైజాగ్కు రాజధాని హంగులు అద్దడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విశాఖలో ప్రాధాన్యతా ప్రాజెక్టులపై చర్చించిన సీఎం జగన్.. నగరం మరింత అభివృద్ధి చెందాలంటూ ఆదేశాలిచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టు, బీచ్ కారిడార్ ప్రాజెక్ట్, పోలవరం నుంచి గోదావరి జలాలను పైపులైన్ ద్వారా విశాఖకు తరలింపు పనులను వేగంగా చేపట్టాలని చెప్పారు.
విశాఖపట్నం నుంచి భీమిలి వరకూ ఇప్పుడున్న బీచ్రోడ్డు విస్తరణ, అలాగే భీమిలి నుంచి భోగాపురం వరకూ బీచ్ రోడ్డు నిర్మాణంపై సీఎం చర్చించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారులు సీఎంకు వివరించారు. భూసేకరణతో కలుపుకుని భీమిలి నుంచి భోగాపురం వరకూ రోడ్డు నిర్మాణానికి దాదాపు 1 వేయి 167 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమిక అంచనా వేసినట్టు చెప్పారు. బీచ్ కారిడార్ ప్రాజెక్టును యుద్ధప్రాతిపదిక చేపట్టాలని సీఎం ఆదేశించారు. దేశంలో అందమైన రోడ్డుగా నిలిచిపోవాలని స్పష్టం చేశారు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. పోలవరం నుంచి గోదావరి జలాలను విశాఖనగరానికి తరలింపుపై ప్రత్యేకంగా చర్చించారు. రానున్న 30 ఏళ్లకాలానికి విశాఖ నగరానికి నీటి అవసరాలను తీర్చేలా ప్రణాళిక రూపొందించి అత్యంత ప్రాధాన్యతా ప్రాజెక్టుగా చేపట్టాలని ఆదేశించారు.
విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్పైనా సమావేశంలో చర్చించారు. విశాఖ స్టీల్ప్లాంట్ గేట్ నుంచి భోగాపురం వరకూ మొత్తంగా 76.9 కిలోమీటర్ల మేర నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేస్తున్నట్లు అదికారులు వివరించారు. ఈ మార్గంలో 53 స్టేషన్లు ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో పాటు 60.2 కిలోమీటర్ల మేర ట్రాం కారిడార్ కూడా ఏర్పాటు చేయనన్నారు. దీంతో మెట్రో, ట్రాం కలిపి 137.1 కి.మీ. కారిడార్ నిర్మాణం జరగనుంది. మెట్రో నిర్మాణానికి దాదాపు 14 వేల కోట్లు, ట్రాం సర్వీసులకు మరో 6 వేల కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. రెండు ప్రాజెక్టులకు కలిపి 20 వేల కోట్లకుపైగా ఖర్చుకు సంబంధించిన అంచనాలను అధికారులు సీఎం అందజేశారు. మొత్తంగా జగన్ సర్కార్ విశాఖకు రాజధాని హంగులు అద్దుతోంది. వీలైనంత వేగంగా ఉక్కు నగరాన్ని మరింత అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తోంది.