ఇట్స్ టైమ్ టూ ఓట్: ఏపీ పంచాయతీ ఎన్నికలు షురూ

ఇట్స్ టైమ్ టూ ఓట్: ఏపీ పంచాయతీ ఎన్నికలు షురూ

AP Panchayath Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ తొలిదశ ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం 6గంటల 30నిమిషాలకి మొదలైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రశాంతంగా ఎన్నికలు ముగించాలని ప్లాన్ చేసింది కమిషన్. చలి తీవ్రత కారణంగా ఓటర్లు కాస్త తక్కువగా ఉన్నారు. ఉదయం 8 నుంచి ఓటర్ల సంఖ్య పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. అనూహ్య ఘటనలు, బదిలీలు, లేఖాస్త్రాలు, ఫిర్యాదులు, ఆరోపణలు, ప్రత్యారోపణల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.

వార్డుల్లో బ్యాలెట్ ముద్ర పడుతోంది. అధికారులు పోలింగ్ కోసం 29వేల 732 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి విడతలో భాగంగా 32వేల 502 వార్డు మెంబర్లు, 3వేల 249 సర్పంచ్ పదవులకు కోసం ఓటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 3గంటల 30నిమిషాల వరకూ పోలింగ్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 525 గ్రామ పంచాయతీలు, 12వేల 185 వార్డు మెంబర్ల ఎన్నిక ఏకగ్రీవమైంది. 3వేల 458 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా 3వేల 594 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.

మధ్యాహ్నం 4గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. కౌంటింగ్ కోసం 14వేల 535 సూపర్వైజర్లు, 37వేల 750 మంది సిబ్బంది పని చేస్తారు. కౌంటింగ్ ప్రక్రియ పోలింగ్ స్టేషన్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా బొప్పనపల్లి, వడ్డిగూడెం గ్రామపంచాయతీల్లో నేడు జరగాల్సిన పోలింగ్‌ను రెండో దశకు వాయిదా వేశారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏకగ్రీవాలపై తుదినిర్ణయం ఎస్ఈసీదేనని పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.

ఎన్నికలు జరిగే మండలాలు ఇవే:

విశాఖపట్నం: అనకాపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అచ్యుతాపురం, అనకాపల్లి, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, కశింకోట, వి.మాడుగుల, మునగపాక, రాంబిల్లి, యలమంచిలి, బుచ్చియ్యపేట, చోడవరం

కృష్ణా: విజయవాడ రెవెన్యూ డివిజన్ పరిధిలోని చందర్లపాడు, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కంచికచర్ల, కంకిపాడు, మైలవరం, నందిగామ, పెనుగంచిప్రోలు, పెనమలూరు, తోట్లవల్లూరు, వత్సవాయి, వీరుళ్లపాడు, విజయవాడ రూరల్ మండలాలు

గుంటూరు: తెనాలి రెవెన్యూ డివిజన్ లోని అమర్తలూరు, బాపట్ల, భట్టిప్రోలు, చేబ్రోలు, చెరుకుపల్లి, దుగ్గిరాల, కాకుమాను, కర్లపాలెం, కొల్లిపరం, కొల్లూరు, నగరం, నిజాంపట్నం, పి.వీ పాలెం, పొన్నూరు, తెనాలి, రేపల్లె, టి.చుండూరు, వేమూరు మండలాలు

ప్రకాశం: ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అద్దంకి, బల్లికురవ, చీమకుర్తి, చినగంజాం, చీరాల, ఇంకొల్లు, జె.పంగులరు, కారంచేడు, కొరిశపాడు, కొత్తపట్నం, మార్టూరు, మద్దిపాడు, ఎస్.జీ పాడు, ఒంగోలు, పర్చూరు, సంతమాగులూరు, సంతనూతలపాడు, వేటపాలెం, టంగుటూరు, యద్దనపూడి మండలాలు

శ్రీకాకుళం: శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఎల్.ఎన్.పేట, లావేరు, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం కొత్తూరు, హిరమండలం, పాతపట్నం, మెళియాపుట్టి మండలాలు

తూర్పు గోదావరి: కాకినాడ, పెద్దాపురం రెవెన్యూ డివిజన్ల పరిధిలోని గొల్లప్రోలు, కాకినాడ రూరల్, కరప, పెదపూడి, పిఠాపురం, సామర్లకోట, తాళ్లరేవు, యు.కొత్తపల్లి, గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, కోటనందూరు, పెద్దాపురం, ప్రత్తిపాడు, రంగంపేట, రౌతలపూడి, శంఖవరం, తొండగి, తుని, ఏలేశ్వరం మండలాలు

పశ్చిమగోదావరి: నర్సాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఆకివీడు, భీమవరం, ఆచంట, కాళ్ల, మొగల్తూరు, నర్సాపురం, పాలకోడేరు, పాలకొల్లు, పోడూరు, ఉండి, వీరవాసరం, యలమంచిలి మండలాలు

కడప: జమ్మలమడుగు, కడప, రాజంపేట రెవెన్యూ డివిజన్ల పరిధిలోని చాపాడు, మైదుకూరు, దువ్వూరు, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఖాజీపేట, బద్వేలు, అట్లూరు, బి.కోడూరు, గోపవరం, పారుమామిళ్ల, ఎస్.ఎ.కే.ఎన్ పాడు, కలసపాడు, బి.మఠం మండలాలు

కర్నూలు: నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఆళ్లగడ్డ, చాగలమర్రి, దోర్నిపాడు, రుద్రవరం, సిరివెళ్ల, ఉయ్యాలవాడ, గోస్పాడు, నంద్యాల, బండి ఆత్మకూరు, మహానంది, ఆత్మకూరు, వెలుగోడు మండలాలు

అనంతపురం: కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న అమడగూరు, బుక్కపట్నం, గాండ్లపెంట, కదిరి, కొత్తచెరువు, ఎన్.పి.కుంట, నల్లమడ, ఓదులదేవర చెరువు, పుట్టపర్తి, తలుపుల, తనకల్లు మండలాలు

చిత్తూరు: చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న బంగారుపాళ్యం, చిత్తూరు, గంగాధర నెల్లూరు, గుడిపాల, ఐరాల, కార్వేటినగరం, నగరి, నారాయణవనం, నిండ్ర, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు, పుత్తూరు, అర్.సీ.పురం, ఎస్.ఆర్ పురం, తవణంపల్లి, వడమాలపేట, వెదురుకుప్పం, విజయపురం, యడమారి మండలాలు

నెల్లూరు: కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని అల్లూరు, బోగోలు, దగదర్తి, దత్తలూరు, జలదంకి, కలిగిరి, కావలి, కొండాపురం, వరికుంటపాడు మండలాలు

బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్న పోలింగ్ కోసం 18వేల 608 పెద్ద బ్యాలెట్ బాక్సులు, 8వేల 503 మధ్య రకం బ్యాలెట్ బాక్సులు. 21వేల 338 చిన్న బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాయి. ఎన్నికల కోసం దాదాపు 90వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. వారిలో స్టేజ్ – 1 ఆర్ఓలు వెయ్యి 130, స్టేజ్-2 ఆర్ఓలు-3వేల 249, ఏఆర్ఓలు వెయ్యి 432, పీఓలు 33వేల 533, ఇతర పోలింగ్ సిబ్బంది 44వేల 392 మంది, జోనల్ అధికారులు 519, రూట్ అధికారులు వెయ్యి 121, మైక్రో అబ్జర్వర్లు 3వేల 046 మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. 5 కిలోమీటర్ల కంటే ఎక్కువగా దూరం ఉన్న పోలింగ్ కేంద్రాలకు 2వేల 216 పెద్ద వాహనాలు, 5 కిలోమీటర్ల కంటే తక్కువ దూరం ఉన్న స్టేషన్లకు వెయ్యి 412 చిన్నస్థాయి వాహనాలను సిద్ధం చేశారు.