Chandrababu: రాష్ట్రంలో విద్యుత్ కోతలు, ప్రజల వెతలపై సీఎస్‌కు లేఖ రాసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు

రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీర్చాలంటూ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు

Chandrababu: రాష్ట్రంలో విద్యుత్ కోతలు, ప్రజల వెతలపై సీఎస్‌కు లేఖ రాసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు

Chanba

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కోతలు ప్రజలని ఇబ్బంది పెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా పరిశ్రమలకు సైతం పవర్ హాలిడే ప్రకటిస్తుంది ప్రభుత్వం. ఈనేపధ్యంలో రాష్ట్రంలో విద్యుత్ కష్టాలను తీర్చాలంటూ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతల ప్రభావం, ప్రజల ఇబ్బందులను వివరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు సీఎస్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతోనే రాష్ట్రంలో విద్యుత్ రంగం నిర్వీర్యం అయ్యిందని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు. నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్ అందించినపుడే పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు పురోభివృద్ధి సాధిస్తాయని తెలిపారు. 2014లో రాష్ట్రంలో 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంటే..2019 నాటికి 19160 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం సాధించి దేశంలో మిగులు విద్యుత్ సాధించిన మూడు రాష్ట్రాల్లో ఏపీని నిలిపామని చంద్రబాబు గుర్తుచేశారు.

Also read:Bhadrachalam : సీతారాముల కల్యాణం చూతమురారండి.. ముఖ్యమైన ఘట్టాలివే

నాడు 45 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండే పరిస్థితి ఉంటే…ఇప్పుడు ఆపరిస్థితి ఎందుకు లేదని లేఖలో ప్రశ్నించిన చంద్రబాబు..బొగ్గు సరఫరా సంస్థలకు బకాయిలు చెల్లించకపోవడం ఇందుకు కారణం కాదా అంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. విద్యుత్ సంస్థల పేరిటి తెచ్చిన రూ.26 వేల కోట్ల అప్పులు ఏమయ్యాయి?..చార్జీల పెంపుతో వచ్చిన రూ.16 వేల కోట్లు ఏమయ్యాయి? అని ఈసందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు. తమ హయాంలో భవిష్యత్ అవసరాల కోసం సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ కోతలు, ధరల వాతలకు.. ప్రభుత్వ నిర్లక్ష్యం, కక్ష పూరిత, అవినీతి విధానాలే కారణమని విమర్శలు గుప్పించారు.

Also read:AP New Cabinet : కొత్త మంత్రివర్గం లిస్టు సిద్ధం.. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

విద్యుత్ పీపీఏల రద్దుతో ముఖ్యమంత్రి, అధికారులు మొండిగా ముందుకు వెళ్లి..విద్యుత్ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రబీలో బోర్ల కింద సాగవుతున్న పంటలు..మరో 15-20 రోజుల్లో చేతికొస్తాయి. ఇలాంటి సమయంలో విద్యుత్‌ లేక పంటలు ఎండిపోతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం, చిత్తూరు సహా పలు ప్రాంతాల్లో ఎండిన పంటలే ఇందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. అప్రకటిత కరెంటు కోతలతో వ్యవసాయ అనుబంధ రంగాలైన ఆక్వా, పౌల్ట్రీ పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతున్నాయని..పరిశ్రమలకు పవర్ హాలిడే కారణంగా రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది జీవనోపాధి కోల్పోతారని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Also read:Ram Navami 2022 : కన్నుల పండువగా జరిగిన రాములోరి ఎదుర్కోలు ఉత్సవం

కడప జిల్లా రిమ్స్ ఆస్పత్రిలో విద్యుత్ లేకపోవడంతో రెండు రోజుల్లో ముగ్గురు శిశువులు ప్రాణాలు కోల్పోయారని, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో సెల్ ఫోన్ లైట్ల వెలుగులో ప్రసవాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో గంటల పాటు విద్యుత్ కోతలతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..విద్యుత్ సంక్షోభం పై మీరు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామంటూ సీఎస్ కు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. లేఖతో పాటు ప్రాంతీయ, జాతీయ మీడియాలో కరెంట్ కష్టాలపై ప్రసారం అయిన న్యూస్ వీడియోలను చంద్రబాబు జత చేశారు.