Remand Report : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసు రిమాండ్ రిపోర్టు.. కీలక విషయాలు వెల్లడించిన సీఐడీ
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఏపీ సీఐడీ కీలక విషయాలు వెల్లడించింది. 2015 జూన్లోనే స్కామ్కు ప్లాన్ చేసినట్టు గుర్తించింది.
AP Skill Development Case : ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఏపీ సీఐడీ కీలక విషయాలు వెల్లడించింది. 2015 జూన్లోనే స్కామ్కు ప్లాన్ చేసినట్టు గుర్తించింది. జీవో నెంబర్ 4 ప్రకారం సీమెన్స్ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్విల్కర్కు అప్పటి ప్రభుత్వం.. 241 కోట్లు ఇచ్చిందని తెలిపింది. దురుద్దేశపూర్వకంగా అప్పటి ప్రభుత్వం సొమ్ము అప్పగించిందని వెల్లడించింది. 241 కోట్లను పలు షెల్ కంపెనీలకు బదలాయించారని తేల్చింది. 7 షెల్ కంపెనీల ద్వారా తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించినట్టు తెలిపింది.
ప్రాజెక్టు వ్యయాన్ని ప్రభుత్వానికి, టెక్నాలజీ కంపెనీలకు విభజించడంలో మోసాలు జరిగాయని ఏపీ సీఐడీ వెల్లడించింది. 2017-18లో 371 కోట్లలో 241 కోట్లు గోల్మాల్ జరిగినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ గుర్తించినట్లు సీఐడీ రిమాండ్ రిపోర్ట్లో తెలిపింది. ప్రభుత్వం 10 శాతం.. డిజీటెక్ 90 శాతం ఇవ్వవలసి ఉండగా.. డిజిటెక్ 90శాతం ఇవ్వకముందే ప్రభుత్వ వాటా రిలీజ్ చేసినట్టు గుర్తించింది సీఐడీ. 2017లో డీజీజీఐ డిజైన్ టెక్ పై కేసు నమోదు చేసినట్టు తెలిపింది.
Saitej’s Funeral : సైనిక లాంఛనాలతో సాయితేజ్ అంత్యక్రియలు పూర్తి
సుమన్ బోస్ గా సౌమ్యాద్రి శేఖర్ బోస్ సంతకం చేసినట్టు తేల్చారు. ఏపీ, గుజరాత్ అగ్రిమెంట్లలో సంతకాల మధ్య వ్యత్యాసం గుర్తించింది సీఐడీ. అగ్రిమెంట్లపై సీమెన్స్ పరిశోధన ప్రారంభమైన వెంటనే సౌమ్యాద్రి శేఖర్ బోస్ రాజీనామా చేశారు. సీమెన్స్ ఎండీ, వికాస్ కన్విల్కర్ ల మధ్య కరెన్సీ నోట్ల నంబర్లను టోకెన్ నంబర్లుగా పంపుకున్నట్టు గుర్తించించింది సీఐడీ. ముఖ్యమైన ఫైళ్లు, పత్రాలు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి తొలగించినట్టు వెల్లడించింది
ఈ కేసులో ప్రాథమిక ఆధారాల మేరకు ఐపీసీ సెక్షన్లు 120(B), 166, 167, 418, 420, 475, 468, 471, 409, 201, 109 r/w 34,37 కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. తదుపరి విచారణ ఈనెల 24కు వాయిదా వేసింది. నిందితులను అధికారులు మచిలీపట్నం సబ్జైలుకు తరలించారు.