Devineni Uma: టీడీపీ మేనిఫెస్టోను చూసి తాడేపల్లి కొంపలో భూకంపం: దేవినేని ఉమ
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనకు పిచ్చి పట్టినట్లు అనిపిస్తోందని దేవినేని ఉమ అన్నారు.

Devineni Uma Maheswara Rao
Devineni Uma – TDP Manifesto: టీడీపీ మేనిఫెస్టోను చూసి తాడేపల్లి కొంపలో (సీఎం జగన్ క్యాంప్ ఆఫీసులో) భూకంపం వచ్చినట్లు అయిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోతో వైసీపీలో వణుకు మొదలైందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా మైలవరం, కొండపల్లి మునిసిపాలిటీలో చంద్రబాబు చిత్రపటానికి తెలుగు మహిళలు, పార్టీ కౌన్సిలర్లతో కలిసి దేవినేని ఉమ క్షీరాభిషేకం చేశారు.
అనంతరం దేవినేని ఉమ మాట్లాడారు. కొడాలి నాని మాట్లాడుతున్న మాటలు సరికాదని, తప్పుడు కూతలు కూసిన ప్రతివారు తాము అధికారంలోకి వచ్చాక జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. ఎక్కడ ఉన్నా ఈడ్చుకొచ్చి జైల్లో వేస్తామని చెప్పారు. కొందరు వైసీపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని అన్నారు.
వారిలో అభద్రతా భావం ఉందని చెప్పారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆయనకు పిచ్చి పట్టినట్లు అనిపిస్తోందని అన్నారు. నాలుగేళ్లుగా వైసీపీ సర్కారు ప్రజలకు ఏమీ చేయలేకపోయిందని, ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో ప్రకటిస్తే ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. టీడీపీ మేనిఫెస్టో మీద వైసీపీ ఏడుపులు ఏంటని నిలదీశారు.
అసమర్థ నేతలకు పదవులు ఎందుకని ప్రశ్నించారు.
Budda Venkanna : చంద్రబాబు కనుసైగ చేస్తే ఏమైపోతారో- కొడాలి నానికి బుద్ధా వెంకన్న వార్నింగ్