Godavari Flood : కూలుతున్న గోదావరి గట్లు.. భయాందోళనలో ప్రజలు
వరద పోటుకి బలహీనంగా ఉన్న గోదావరి గట్లు కూలిపోతున్నాయి. నరసాపురంలోని వశిష్ట గోదావరి ఏటిగట్టు గత రాత్రి నదిలో కూలిపోయింది. దీంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు.
Godavari Flood : పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి ఉధృతి కొనసాగుతూనే ఉంది. వరద పోటుకి బలహీనంగా ఉన్న గోదావరి గట్లు కూలిపోతున్నాయి. నరసాపురంలోని వశిష్ట గోదావరి ఏటిగట్టు గత రాత్రి నదిలో కూలిపోయింది. దీంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఎక్కడి నుంచి ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు గోదావరి గట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలు పేర్చుతున్నారు.
ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి మహోగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరి శాంతించింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద వరద ప్రవాహం నిలకడగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ధవళేశ్వరం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 23.30 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాగా, ఇంకా 241 గ్రామాలు వరద గుప్పిట్లోనే ఉన్నాయి. ఆయా గ్రామాల్లో వరద నీరు తొలగిపోలేదు. గోదావరి వరదలతో 6 జిల్లాల్లోని 385 గ్రామాలు ప్రభావితం అయ్యాయి.
Yanam : గోదావరి వరద నీటిలో మునిగిన యానాం
ఎగువనున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఉప్పెనలా వరదతో గోదావరి విరుచుకుపడుతోంది. వరద ఉధృతి ధాటికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న తొమ్మిది ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మీ, సరస్వతి బ్యారేజ్లను గోదావరి వరద ముంచెత్తింది.
గోదావరి చరిత్రలో 1986లో రికార్డు స్థాయిలో 35,06,338 క్యూసెక్కులు ప్రవాహం వచ్చినప్పుడు కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 15.75 అడుగులుగా నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోయింది. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోయింది. గోదావరికి 1986, ఆగస్టు 16న రికార్డు స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలంలో గరిష్ఠంగా 75.6 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత ఆగస్టు 24, 1990న 70.8 అడుగులుగా నమోదైంది. ఆ తర్వాత గత 32 ఏళ్లుగా ఎన్నడూ భద్రాచలం వద్ద వరద నీటిమట్టం 70 అడుగులను దాటలేదు.
Godavari Floods : గోదావరి వరదతో కోనసీమ విలవిల..ఇంకా అంధకారంలోనే లంకలు, ఏజెన్సీ గ్రామాలు
గోదావరికి 1954, 1986, 1990, 2006, 2013, 2020లలో వచ్చిన వరదలే పెద్దవిగా నమోదయ్యాయి. ఆ వరదలన్నీ ఆగస్టు నెలలోనే వచ్చాయి. ఎక్కువగా ఆగస్టు మొదటి, రెండు వారాల్లోనే భారీ వరదలు వస్తుండడం సహజంగా కనిపించింది. ఈసారి అందుకు భిన్నంగా ధవళేశ్వరం వద్ద జూలై 14వ తేదీ సాయంత్రానికే మూడో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటింది.