Gannavaram High Tension : గన్నవరంలో హైటెన్షన్.. టీడీపీ ఆఫీస్పై దాడి, కారుకి నిప్పు
కృష్ణా జిల్లా గన్నవరంలో హైటెన్షన్ నెలకొంది. గన్నవరం రగులుతోంది. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. ఆఫీస్ ను ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి ఓ కారుకు నిప్పు పెట్టారు. ఇది వైసీపీ కార్యకర్తల పనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Gannavaram High Tension : కృష్ణా జిల్లా గన్నవరంలో హైటెన్షన్ నెలకొంది. గన్నవరం రగులుతోంది. గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగింది. ఆఫీస్ ను ధ్వంసం చేశారు. ఆఫీస్ ఆవరణలో ఉన్న ఓ కారుకి నిప్పు పెట్టారు. మంటల్లో కారు పూర్తిగా కాలిపోయింది. ఇది వైసీపీ కార్యకర్తల పనే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నిన్న టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి ఈ దాడులకు తెగబడ్డారని టీడీపీ నేతలు అంటున్నారు. ఈ ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పరిస్థితి చేయి దాటిపోకుండా పోలీసులు భారీగా మోహరించారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు భారీగా పార్టీ ఆఫీస్ దగ్గరికి చేరుకుంటున్నాయి.
టీడీపీ ఆఫీస్ పై దాడిని నిరసిస్తూ గన్నవరం జాతీయ రహదారిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో చేస్తున్నారు. రోడ్డుపై బైఠాయించి వంశీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.
అదే సమయంలో ఇరువర్గాలు రోడ్డు మీదకు వచ్చి రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో టౌన్ సీఐ కనకారావుకి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు తల నుంచి రక్తం కారుతోంది. ఆయనను ఆస్పత్రికి తరలించారు. మరోవైపు అగంతకులు డీఎస్పీ విజయ పాల్ ను చుట్టుముట్టారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు. అటు జాతీయ రహదారిని సైతం దిగ్బంధించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
గత నాలుగు రోజులుగా గన్నవరం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. చంద్రబాబు, లోకేశ్ ను ఉద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. గన్నవరం టీడీపీ టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలతో వివాదం మరింత ముదిరింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. టీడీపీ ఆఫీస్ పై దాడికి దారితీసింది.