విజయవాడ భవానీపురం బాలిక హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

  • Published By: bheemraj ,Published On : August 4, 2020 / 05:44 PM IST
విజయవాడ భవానీపురం బాలిక హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు

చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన మరో హంతకుడి పాపం పండింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. అత్యాచారం, చేసి దారుణంగా హతమార్చిన కిరాతకుడికి కోర్టు సరైన తీర్పునిచ్చింది. అన్నీ కోణాల్లో కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఇలాంటి వ్యక్తికి బతికే హక్కు లేదంటూ ఉరిశిక్షను ఖరారు చేసింది. జిల్లా కోర్టు ఇచ్చిన సంచలన తీర్పుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

విజయవాడ భవానీపురం బాలిక హత్య కేసులో కోర్టు సంచలన తీర్చునిచ్చింది. చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన ఘటనలో…నిందితుడికి కృష్ణా జిల్లా కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఆలస్యమైనా…తమకు న్యాయం జరిగిందని..ఈ తీర్పుతో తమ కూతురి ఆత్మ శాంతిస్తుందని…బాధిత కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. ఆలస్యం చేయకుండా వెంటనే ఉరి తీయాలని పోలీసులను వేడుకుంది.

అనిల్‌, వెంకటరమణలు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు. ఇద్దరు కొడుకులను నందిగామ మండలం గోళ్లమూడిలో బంధువుల ఇంటి దగ్గర ఉంచి చదివిస్తున్నారు. ఎనిమిదేళ్ల కుమార్తె ద్వారక తల్లిదండ్రులతోనే ఉండేది. స్థానిక పాఠశాలలో రెండో తరగతి చదివేది. ఓ రోజు సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న ద్వారక మాయమైంది.

పాప కోసం తల్లిదండ్రులు ఇంటి పరిసర ప్రాంతాలతో పాటు ఊరంతా గాలించారు. అయినా ఆచూకీ లభించలేదు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు సైతం పాప ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. మరుసటి రోజు ఉదయానికి కూడా పాప జాడ తెలియకపోవడంతో ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే కోణంలోనూ దృష్టి పెట్టారు.

అనుమానం ఉన్న వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఓ వైపు పోలీసులు ఊరంతా జల్లెడ పడుతుంటే…బాలిక ఉంటున్న పక్కింట్లోనే మృతదేహం దొరకడం కలకలం సృష్టించింది. పక్క ఇంట్లో ఉండే పెంటయ్య అనే వ్యక్తి పాపను హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

చిన్నారిని హత్య చేసిన పెంటయ్య.. ఆ తర్వాత పాప పేరెంట్స్‌తోనే ఉన్నాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పాప కోసం వెతికాడు. పాప వెంటనే దొరకాలని కంటతడి పెట్టినట్లు నటించాడు. కానీ… అతని ఇంట్లోనే ద్వారక మృతదేహం లభించడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకునే చిన్నారని చంపిన వాడిని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేశారు.

చిన్నారి హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పెంటయ్యను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అతడితో పాటు మరికొంత మంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఓ వైపు పెంటయ్యను తమదైన శైలిలో విచారిస్తునే.. మరోవైపు అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుని విచారించారు.

దాదాపు తొమ్మిది నెలల పాటు…అన్ని కోణాల్లో విచారించి పెంటయ్యను దోషిగా నిర్ధారించారు. భవానీపురం పోలీసులు సాంకేతికపరమైన ఆధారాలు సేకరించడంతో.. న్యాయమూర్తి శిక్ష ఖరారు చేశారు. ఈ కేసులో 7 యేళ్లు, 20యేళ్లు, జీవిత ఖైదు, ఉరి శిక్షను న్యాయమూర్తి విధించారు.

పెదనాన్న అని పిలిచిన తన కుమార్తెను పెంటయ్య అత్యంత కిరాతకంగా చంపేశాడని..ద్వారకా తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు ఏమీ ఎరుగనట్లు తమతో కలిసి పాపను వెతికాడన్నారు. చిన్నారిని చంపినందుకు ఉరిశిక్షే సరైనదని..వెంటనే ఉరి తీయాలని వేడుకున్నాడు.

తల్లిదండ్రులే కాదు..బంధువులు, స్థానికులు కూడా కోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేశారు. ఓ వైపు ఇలా హంతకులకు శిక్షలు పడుతున్నా..మరోవైపు..చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుండటం కలకలం రేపుతోంది.