Uyyalawada Narasimha Reddy : కర్నూలు కల నెరవేరింది, ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పేరు
కర్నూలు కల నెరవేరింది. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభమైంది. సీఎం జగన్ ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించారు.
Kurnool : కర్నూలు కల నెరవేరింది. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభమైంది. సీఎం జగన్ ఓర్వకల్లు విమానాశ్రయాన్ని ప్రారంభించారు. కర్నూలు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం నెరవేర్చారు. ఎయిర్పోర్టు కావాలన్న జిల్లా ప్రజల కల ఈనాటిది కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఎయిర్పోర్ట్ కోసం భూ సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఆ తర్వాత 2014లో కర్నూలు జిల్లాకు కేంద్రం ఎయిర్ పోర్టు మంజూరు చేసింది. కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలోని ఓర్వకల్లు దగ్గర వెయ్యి 8 ఎకరాల స్థలం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
అయితే భూ సేకరణతో పాటు ఇతర అనుమతుల్లో తీవ్ర జాప్యం జరిగి ఎయిర్పోర్టు నిర్మాణం ఆలస్యమైంది. ఏడాదిన్నరగా నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనుమతులు లభించడంతో విమానాల రాకపోకలకు మార్గం సుగమమయింది. ఈ నెల 28 నుంచి ఓర్వకల్లులో విమానాలు ఎగరనున్నాయి. తొలి దశలో చెన్నై, బెంగళూరు, విశాఖ పట్టణానికి రాకపోకలు సాగుతాయి. ఒకేసారి నాలుగు విమానాలు పార్క్ చేసే సౌకర్యం ఉండడంతో ముందు ముందు మరిన్ని సర్వీసులు ప్రారంభించే అవకాశముంది.
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఎయిర్పోర్ట్ను సీఎం జగన్ 2021, మార్చి 25వ తేదీ గురువారం ప్రారంభించారు. ఈ నెల 28 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని సీఎం తెలిపారు. బెంగళూరు, చెన్నై, విశాఖపట్టణానికి..విమాన సర్వీసులు ఉంటాయన్నారు. ఒకేసారి నాలుగు విమానాలు పార్క్ చేసుకునే వీలుందన్నారు. రాష్ట్రంలో ఆరు ఎయిర్పోర్టులు ఉండడం సంతోషంగా ఉందన్నారు సీఎం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్కు ప్రముఖ స్వాతంత్రయోధుడు ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి పేరు పెడుతున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. సిపాయిల తిరుగుబాటుకు ముందే 1847వ సంవత్సరంలోనే రైతుల కోసం పరాయి పాలనపై ఉయ్యాల వాడ నర్సింహారెడ్డి పోరాడారని జగన్ అన్నారు.
ఓర్వకల్లు ఎయిర్పోర్టుకు ఉయ్యాలవాడ పేరు పెట్టడం గర్వంగా ఉందన్నారు. ఓర్వకల్లు విమానాశ్రయం…రాష్ట్ర న్యాయరాజధాని కర్నూలును అన్ని ప్రాంతాలకూ కలిపే ఎయిర్పోర్టుగా ఉంటుందని సీఎం జగన్ అన్నారు. ఎన్నికల్లో లబ్ది కోసం ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తికాకముందే…అనుమతులు రాకముందే..చంద్రబాబు దీన్ని ప్రారంభించారని సీఎం ఎద్దేవా చేశారు. 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు..రిబ్బన్ కటింగ్ చేశారని…అప్పటికి రన్ వే నిర్మాణం కూడా పూర్తికాలేదని సీఎం ఆరోపించారు.