Lokesh Padayatra : తారకరత్న మృతితో నారా లోకేష్ యువగళం పాదయాత్రకి బ్రేక్…
తారకరత్న మరణించడంతో ప్రస్తుతానికి నారా లోకేష్ యువగళం పాదయాత్రకి బ్రేక్ ఇచ్చారు. తారకరత్నకి నివాళులు అర్పించేందుకు లోకేష్ రేపు ఉదయం హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. ప్రస్తుతం..............
Lokesh Padayatra : తెలుగు సినీపరిశ్రమలో మరో విషాదం నెలకొంది. గత కొద్దికాలంగా వరుసగా పలువురు ప్రముఖులు మరణించి తెలుగు సినీ పరిశ్రమని తీవ్ర విషాదంలో ముంచెత్తారు. తాజాగా నటుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. దీంతో మరోసారి సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న మృతిపై సంతాపం తెలియచేస్తున్నారు.
నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, భద్రాద్రి రాముడు, నందీశ్వరుడు, అమరావతి.. లాంటి పలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులని మెప్పించిన నటుడు తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా అడపాదడపా సినిమాల్లో నటిస్తున్న తారకరత్న ఎలక్షన్స్ దగ్గరికి వస్తుండటంతో గత కొన్ని రోజులుగా టీడీపీలో యాక్టివ్ గా పనిచేయడం మొదలుపెట్టారు. ఇటీవల నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో బావ నారా లోకేష్ తో పాటు కలిసి నడవటానికి వచ్చారు తారకరత్న. ఈ పాదయాత్ర మొదటి రోజే కుప్పంలో నడుస్తుండగా సడెన్ గా గుండెపోటు రావడంతో కింద పడిపోయారు తారకరత్న.
ఇది గమనించిన వెంటనే కార్యకర్తలు, టీడీపీ నేతలు కుప్పం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగుళూరుకు తరలించారు. గత 23 రోజులుగా బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న చికిత్స తీసుకుంటూ శనివారం రాత్రి మరణించారు. దీంతో సినీ పరిశ్రమతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా విషాదంలో మునిగిపోయారు.
తారకరత్న మరణించడంతో ప్రస్తుతానికి నారా లోకేష్ యువగళం పాదయాత్రకి బ్రేక్ ఇచ్చారు. తారకరత్నకి నివాళులు అర్పించేందుకు లోకేష్ రేపు ఉదయం హైదరాబాద్ కు బయలుదేరనున్నారు. ప్రస్తుతం అంత్యక్రియలు అయ్యేవరకు నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. సోమవారం నాడు తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి. ఆ తర్వాత పాదయాత్ర మళ్ళీ ఎప్పుడు మొదలుపెట్టనున్నారో త్వరలో సమాచారం ఇస్తారు.
Tarakaratna : సోమవారం సాయంత్రం తారకరత్న అంత్యక్రియలు..
ఇక తారకరత్న మృతిపై లోకేష్ తన సోషల్ మీడియాలో.. బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగులు చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళులతో…..నారా లోకేష్ అంటూ సంతాపం తెలియచేశారు.