ఏపీలో మరో ప్రేమోన్మాదం, పురుగుల మందు తాగలేదని ప్రియురాలి దారుణ హత్య

  • Published By: naveen ,Published On : November 26, 2020 / 11:24 AM IST
ఏపీలో మరో ప్రేమోన్మాదం, పురుగుల మందు తాగలేదని ప్రియురాలి దారుణ హత్య

lover kills girl friend: ప్రేమించిన యువతితో జీవితాంతం కలిసి జీవించాలని కోరుకుంటారు ఎవరైనా. కానీ ఈ యువకుడు మాత్రం క్రూరంగా ఆలోచించాడు. ప్రేమించిన అమ్మాయి చనిపోవడానికి ఒప్పుకోలేదని పగ పెంచుకున్నాడు. మాట్లాడే పని ఉందంటూ తీసుకెళ్లి కడతేర్చాడు. ఈ ప్రేమోన్మాదం అనంతపురం జిల్లాలో వెలుగు చూసింది.

చివరి నిమిషంలో మనసు మార్చుకున్న ప్రియురాలు, ఆత్మహత్యకు నో:
కళ్యాణదుర్గం మండలం చాపిరి గ్రామానికి చెందిన షాహిదా బేగం, రఘు మూడేళ్లు ప్రేమించుకున్నారు. ఇద్దరి పెళ్లికి పెద్ద వాళ్లు ఒప్పుకోలేదు. అంతేకాదు..ఇటీవల ఇరు కుటుంబాల పెద్దలు ఇద్దరికీ వేర్వేరుగా పెళ్లి నిశ్చయించారు. దీంతో ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకుందామని ప్రియురాలిని ఒప్పించాడు రఘు. అయితే ఈ విషయంలో ఆ తరువాత షాహిదా మనసు మార్చుకుంది. రఘు పురుగుల మందు తాగినా…ఆమె మాత్రం అందుకు నిరాకరించింది. అదృష్టావశాత్తు అతడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.

ఆత్మహత్యకు సహకరించకుండా మరొకరితో పెళ్లికి సిద్ధమవుతోందని కోపం:
నాటి నుంచి షాహిదాపై పగ పెంచుకున్నాడు రఘు. ఆత్మహత్యకు సహకరించకుండా మరొకరితో పెళ్లికి సిద్ధమవుతోందని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనతో కలిసి ఆత్మహత్య చేసుకోలేదనే కోపంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 17న రాత్రి సమయంలో మాట్లాడాలని ఆమెను నమ్మించి ఇంటి నుంచి బయటకి తీసుకెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో ఒక్కడే ఇంటికి తిరిగి వచ్చాడు. యువతి తల్లిదండ్రులు అతడిని ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పలేదు. యువకుడిపై అనుమానంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నవంబర్ 19న యువతి అదృశ్యమైనట్లు కేసు నమోదు చేశారు.



https://10tv.in/war-words-between-guntur-sp-and-nara-lokesh-over-arrest/
మాట్లాడాలని రప్పించి దారుణ హత్య:
యువతి కోసం గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో…రఘును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనంతరం తమదైన శైలిలో విచారించగా…ఏం జరిగిందో చెప్పేశాడు. ఆ రోజు రాత్రి మాట్లాడుదామని
తీసుకెళ్లిన రఘు…ఆత్మహత్య చేసుకుందామంటూ మళ్లీ ఒత్తిడి చేశాడు. అందుకు యువతి నిరాకరించడంతో హతమార్చాడు. మృతదేహాన్ని కణేకల్లు మండలం తుంబిగనూరు సమీపంలోని హెచ్చెల్సీ కాలువలో పడేసి ఇంటికి చేరుకున్నాడు. అతడిచ్చిన సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు… నీటిలో తేలియాడుతున్న మృతదేహాన్ని బయటకు తీసి షాహిదా బేగంగా నిర్ధారించారు.

పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదం:
మరికొద్ది రోజుల్లోనే యువతి పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట విషాదం అలముకుంది. ప్రేమ పేరుతో ప్రాణాలు తీసిన యువకుడ్ని కఠినంగా శిక్షించాలంటూ కన్నీరుమున్నీరయ్యారు యువతి కుటుంబసభ్యులు.