Medico Tapasvi Case : సోషల్ మీడియా స్నేహాలతో జాగ్రత్త, వెంటనే తల్లిదండ్రులకు చెప్పాలి-అమ్మాయిలకు వాసిరెడ్డి పద్మ హెచ్చరిక
Medico Tapasvi Case : గుంటూరు జిల్లా తక్కెళ్లపాడులో జరిగిన బీడీఎస్ విద్యార్థిని తపస్వి హత్య తనను ఎంతగానో బాధించిందని.. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వాపోయారు. సోషల్ మీడియా స్నేహాలతో యువత జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించారు.
తనను వేధిస్తున్నారన్న విషయాన్ని తపస్వి తన తల్లిదండ్రులకు చెప్పలేదన్నారు. ప్రేమ పేరుతో వేధిస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు వాసిరెడ్డి పద్మ. అమ్మాయిలు తమను కాదంటున్నారనే కోపంతో అబ్బాయిలు దారుణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
”ఈ ఘటనపై పోలీసులు మరింత సమగ్రంగా విచారణ జరపాలని కోరాం. అమ్మాయి ఫిర్యాదు ఇచ్చినప్పుడు తన కోరిక మేరకు కేసు నమోదు చేయకుండా కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి పంపాము. దానిపై అమ్మాయి సంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ యువకుడిపై కేసు పెట్టలేదని పోలీసులు చెప్పారు.
సోషల్ మీడియా స్నేహాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనిషి స్వభావం ఎలాంటి తెలుసుకోకుండా స్నేహం చేయడం ప్రమాదకరం. ఇలా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులు.. ప్రతికూల పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తారు అన్నది అమ్మాయిలు అంచనా వేయలేకపోతున్నారు.
Also Read..Man Killed Girlfriend : పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది
ప్రాణం తీసేంత దాకా రావాల్సిన అవసరం లేదు ప్రేమ వ్యవహారాల్లో. ఇదేమీ ఆస్తి తగాదాలు కాదు, సరిహద్దు గొడవలు కాదు, శాశ్వతమైన శత్రుత్వం అంతకన్నా కాదు. అమ్మాయి నాకు సొంతం, నాకు దక్కాల్సిందే అనే ఉన్మాదంతోటి జరుగుతున్నటు వంటి క్రియలు ఇవన్నీ కూడా.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.
ఎవరైనా ప్రేమ పేరుతో వేధిస్తే పిల్లలు వెంటనే తమ తల్లిదండ్రులతో చెప్పుకోవాలి. తల్లిదండ్రులతో కాకపోయినా కనీసం ఇంట్లో ఎవరో ఒకరితో అయినా చెప్పుకోవాలి. తపస్వి తన తల్లిదండ్రులకు వేధింపుల గురించి చెప్పి ఉంటే, వాళ్లు ఏమైనా జాగ్రత్తలు తీసుకుని ఉండేవారేమో. ఇలాంటి ఘటనలు పునరావృతం అయినప్పుడల్లా చాలా బాధ కలుగుతోంది. అమ్మాయి చనిపోయింది. వీడు బతికినా చచ్చినట్లే. కాబట్టి యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది” అని వాసిరెడ్డి పద్మ అన్నారు.
ప్రేమోన్మాది చేతిలో డెంటల్ విద్యార్థిని తపస్వి(21) దారుణ హత్యకు గురైంది. పరీక్షలు ఉండడంతో స్నేహితురాలి ఇంటికి చదువుకోవడానికి వెళ్లిన తపస్విపై హఠాత్తుగా దాడికి దిగిన జ్ఞానేశ్వర్.. సర్జికల్ బ్లేడ్ తో ఆమెగొంతు కోసి పైశాచికంగా హతమార్చాడు. గుంటూరు తక్కెళ్లపాడులో జరిగిన ఈ ఘోరం.. యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది.