Botsa Satya Naryana : టికెట్ల ధరలు నచ్చకపోతే సినిమా వాయిదా వేసుకోండి- భీమ్లా నాయక్పై బొత్స
సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్కు ఎంతమాత్రం భయపడేది లేదు. టికెట్ ధరలు నచ్చకపోతే.. సినిమా విడుదలను వాయిదా వేసుకోవాలి.
Botsa Satya Narayana : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ ఇవాళ విడుదలైంది. దీంతో ఎక్కడ చూసినా పవన్ ఫ్యాన్స్ కోలాహలం కనిపిస్తోంది. ఏపీలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. భీమ్లా నాయక్ విడుదల వివాదానికి దారితీసింది. రాజకీయ రంగు పులుముకుంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది.
ముఖ్యంగా టికెట్ల ధరల విషయంలో వివాదం చెలరేగింది. ప్రభుత్వం నిర్ణయించిన తగ్గింపు ధరలకు థియేటర్లు నడపలేము అని యజమానులు వాపోతున్నారు. మరో దారి లేక పలు చోట్ల థియేటర్లు మూసేశారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మీద కక్షతో తమను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటున్నారు. సీఎం జగన్ చివరికి సినిమా రంగాన్ని కూడా వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.
టికెట్ల ధరలు నచ్చకపోతే సినిమాను వాయిదా వేసుకోవాలని సూచించారు మంత్రి బొత్స. సినిమా టికెట్ల ధరల విషయంలో కమిటీని వేశామని బొత్స గుర్తు చేశారు. ప్రభుత్వం చట్ట ప్రకారమే ముందుకెళ్తుందని ఆయన తేల్చి చెప్పారు. వ్యవస్థకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని ఆయన తేల్చి చెప్పారు. ఏపీలో టికెట్ల ధరలకు సంబంధించి థియేటర్ల యజమానులు, ప్రతిపక్షాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బొత్స కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Bheemla Nayak: చేతులెత్తేసిన యాజమాన్యాలు.. కృష్ణాజిల్లాలో థియేటర్లు బంద్!
‘సోషల్ మీడియాలో మాపై జరుగుతున్న ట్రోలింగ్కు ఎంతమాత్రం భయపడేది లేదు. టికెట్ ధరలు నచ్చకపోతే.. సినిమా విడుదలను వాయిదా వేసుకోవాలి. మా ప్రభుత్వం ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం. ఈ విషయంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదు” అని తేల్చి చెప్పారు మంత్రి బొత్స.
టికెట్ రేట్లు, సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై పరిశ్రమకు చెందిన చిరంజీవి సహా పలువురు ప్రతినిధులు ఇప్పటికే తమ ప్రభుత్వంతో చర్చలు జరిపారని, ఆ చర్చల్లో ప్రస్తావనకు వచ్చిన విషయాలపై ప్రభుత్వం ఓ కమిటీని వేసిందన్నారు బొత్స. కమిటీ నివేదిక వచ్చాక అన్ని విషయాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అప్పటిదాకా పాత జీవో ఆధారంగానే సినిమా టికెట్లు ఉంటాయని స్పష్టం చేశారు. ఇవేవీ పట్టకుండా తమ ప్రభుత్వ తీరుపై సోషల్ మీడియా వేదికగా కొందరు ట్రోలింగ్కు పాల్పడుతున్నారని, ఈ తరహా ట్రోలింగ్కు తాము భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు బొత్స.
శుక్రవారం విజయనగరంలో అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొన్న బొత్స.. సమావేశం అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భీమ్లా నాయక్ సినిమా విడుదల, అతి తక్కువగా ఉన్న సినిమా టికెట్ రేట్ల కారణంగా కొన్ని సినిమా థియేటర్ల మూత తదితరాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. సినిమా టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయనుకుంటే.. ఆ వ్యవహారం తేలేదాకా సినిమా విడుదలను వాయిదా వేసుకోవచ్చు కదా? అని మంత్రి ప్రశ్నించారు.
ఏపీలో భీమ్లా నాయక్ సినిమా విడుదల వేళ థియేటర్లలో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల అమలుపై అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టిన విషయం తెలిసిందే. నిన్నటి నుంచే రెవెన్యూ సిబ్బంది ద్వారా అధికారులు థియేటర్లపై నిఘా పెంచి, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని థియేటర్ల యాజమాన్యాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం సూచించిన ధరలకే టికెట్లు అమ్మాలని అధికారులు తేల్చి చెప్పారు. అంతేకాదు బెనిఫిట్, అదనపు షో లకు పర్మిషన్ కూడా ఇవ్వలేదు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు.
NV Prasad: ప్రభుత్వ నిర్ణయాలతో పవన్ కళ్యాణ్కి ఇబ్బంది లేదు.. నష్టపోతుంది మేమే! -ఎన్వీ ప్రసాద్
‘రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సీఎం జగన్ వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది” అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.