Drugs Seized : అఫ్ఘానిస్తాన్-టూ-విజయవాడ …రూ. 9 వేల కోట్ల డ్రగ్స్ రాకెట్
డ్రగ్స్ మాఫియా కొత్త రూట్లు వెతుకుతోంది. విమానాల ద్వారా, మనుషుల ద్వారా మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న డ్రగ్స్ మాఫియా ఇప్పుడు మరో మార్గాన్ని ఎంచుకుంది.
Drugs Seized : డ్రగ్స్ మాఫియా కొత్త రూట్లు వెతుకుతోంది. విమానాల ద్వారా, మనుషుల ద్వారా మత్తు పదార్థాలను రవాణా చేస్తున్న డ్రగ్స్ మాఫియా ఇప్పుడు మరో మార్గాన్ని ఎంచుకుంది. సముద్ర మార్గాల్లోనూ డ్రగ్స్ను దేశాలు దాటించేస్తోంది. గుజరాత్ తీరంలో పట్టుబడిన హెరాయినే ఇందుకు నిదర్శనం.
ఒకటి కాదు.. రెండు కాదు… ఏకంగా రూ.9000 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలు గుజరాత్ తీరంలో పట్టుబడ్డాయి. ఈ దాడిలో 2వేల 988 కిలోల హెరాయిన్ పట్టుబడింది. ఈ స్థాయిలో హెరాయిన్ పట్టుబడింది బహుశా ప్రపంచంలో ఇక్కడే అంటున్నారు అధికారులు. టాల్కం పౌడర్ పేరుతో మత్తు మందులను దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది.
గుజరాత్లోని ముంద్రా పోర్టుకు రెండు కంటైన్లరు వచ్చాయి. వీటిల్లో భారీ స్థాయిలో డ్రగ్స్ తరలిస్తున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన డీఆర్ఐ అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక రెండు కంటైనర్లనిండా హెరాయిన్ వచ్చినట్టు గుర్తించారు. దీంతో తనిఖీలు నిర్వహించగా భారీ స్థాయిలో హెరాయిన్ పట్టుబడింది.
Also Read : Actor Sonu Sood : పన్నులు ఎగ్గొట్టి సోనూసూద్ విలన్గా మారారా ?
గాంధీనగర్లోని ఫోరెన్సిక్ సైన్ ల్యాబొరేటరీ నిపుణుల సమక్షంలో కంటైనర్స్లో తనిఖీలు నిర్వహించారు డీఆర్ఐ అధికారులు. మొదటి కంటైనర్ నుంచి 1999 కిలోల హెరాయిన్ను గుర్తించగా.. . రెండో కంటైనర్ నుంచి మరో 988 కిలోల స్టఫ్ను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 2వేల 988 కిలోల హెరాయిన్ను పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి విచారణలో కీలక విషయాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, గాంధీ నగర్తోపాటు మాండ్విలో సోదాలు నిర్వహించారు. పలువురిని విచారించారు. ఈ డ్రగ్స్ రాకెట్లో అఫ్ఘాన్ వాసుల ప్రమేయం కూడా ఉన్నట్టు వెల్లడింది.
డీఆర్ఐ తనఖీలు నిర్వహించిన కంటైనర్లు అఫ్ఘానిస్థాన్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. దీంతో హెరాయిన్ రవాణాపై కూపీ లాగుతున్నారు. ఈ హెరాయిన్ను ఎవరు పంపారు, ఎక్కడికి తరలిస్తున్నారు, ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. డీఆర్ఐ విచారణలో కీలక విషయాలు వెలుగు చూసినట్టుగా తెలుస్తోంది.
ఈ అతిపెద్ద డ్రగ్ రాకెట్తో విజయవాడకు లింకులున్నాయా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. అఫ్ఘానిస్తాన్ నుంచి వచ్చిన కంటైనర్లు ఏపీలోని విజయవాడలోని ఓ ట్రేడింగ్ సంస్థకు చెందినవిగా గుర్తించారు. ఆశి ట్రేడింగ్ సంస్థ అఫ్ఘానిస్తాన్ నుంచి ముంద్రా పోర్టుకు దిగుమతి చేసుకున్నట్టు డీఆర్ఐ అధికారులు నిర్ధారించారు. ఆశి ట్రేడింగ్ ఫర్మ్ అనే సంస్థ వీటిని బుక్ చేసుకుంది.
Also Read : Viral Video : ఈ వీడియో చూస్తే ఇంక బేకరీ ఫుడ్ తినరు–పిచ్చి చేష్టలు చేస్తున్న బేకరి వర్కర్లు
కన్సైన్మెంట్లో పేర్కొన్న అడ్రస్ మేరకు విజయవాడలోని సత్యనారాయణపురం వెళ్లిన అధికారులకు అక్కడ ఓ డాబా ఇల్లు మాత్రమే కనిపించిందినట్టుగా తెలుస్తోంది. దీంతో డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఎగుమతి చేసిన సంస్థ హసన్ హుస్సేన్ లిమిటెడ్గా గుర్తించారు. అయితే టాల్కం పౌడర్ ముసుగులో హెరాయిన్ను రవాణా చేస్తున్నట్టు తేల్చారు డీఆర్ఐ అధికారులు. ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్టు నుంచి హెరాయిన్ వచ్చినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు.
ఆశి ట్రేడింగ్ కంపెనీలో అధికారులు సోదాలు చేసినట్లు సమాచారం. గోవింద రాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. మరోవైపు అతిపెద్ద డ్రగ్ రాకెట్లో బెజవాడ ఏజెన్సీ, ఇక్కడి వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఏపీ పోలీసులు ఉలిక్కి పడ్డారు. అంత పెద్ద మొత్తంలో తీసుకొస్తున్న డ్రగ్ను ఇతరత్రా ఏ రాష్ర్టాలకు సరఫరా చేస్తున్నారు.? ఎవరైనా పెద్దల పాత్ర ఉందా? గుట్కా మాఫియా పాత్ర ఉండొచ్చా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే నార్కోటిక్ బ్యూరోతోపాటు ఎన్ఐఏ, సీబీఐ, సీవీసీ సంస్థలు కూడా ఈ డ్రగ్ రాకెట్పై కూపీ లాగుతున్నట్టు తెలుస్తోంది.