సీన్ రివర్స్ : ఆ ఆలయం తలుపులు తెరుచుకోవు
సాధారణంగా గ్రహణ సమయాల్లో దేశంలోని ఆలయాలన్నీ మూతపడ్డా.. ఆ ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి రివర్స్ అయ్యింది. సోమవారం నుంచి దేశంలోని ఆలయాల తలుపులు తెరుచుకుంటుండగా.. ఇప్పుడు ఆ ఆలయం మాత్రం ఓపెన్ కావడం లేదు. ఆ టెంపుల్లోకి మరికొన్ని రోజులు భక్తులకు నో ఎంట్రీ అంటూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఆలయంలోకి భక్తులను అనుమతించకపోవడానికి కారణం ఏమిటి. ఇంతకీ ఎక్కడ ఉందా ఆలయం..
శ్రీకాళహస్తీ ముక్కంటీశ్వరుడు : –
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీ ముక్కంటీశ్వరుడి దర్శనానికి మరికొన్ని రోజుల సమయం పట్టనుంది. స్వామివారి దర్శనానికి భక్తులు మరికొన్ని రోజులు వేచి చూడక తప్పుదు. ఇప్పట్లో భక్తులకు ఆ పరమేశ్వరుని దర్శన భాగ్యం దక్కబోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటితో ఆలయాలన్నీ తెరుచుకున్నాయి. దేశంలోని అన్ని ఆలయాల్లోకి భక్తులను అనుమతిస్తున్నారు. అయితే ముక్కంటి ఆలయానికి మాత్రం ఆ అవకాశం దక్కలేదు. శ్రీకాళహస్తి రెడ్జోన్ పరిధిలో ఉండటం వల్ల.. ఆలయంలోకి భక్తులకు ఎంట్రీ లేదని అధికారులు చెబుతున్నారు.
కరోనా కేసులు : –
నెలన్నర రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాళహస్తి వార్తాలకెక్కింది. పెద్ద సంఖ్యలో అక్కడ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి శ్రీకాళహస్తికి వచ్చిన ఓ యువకుడికి కరోనా సోకడంతో మొదలైన కేసుల సంఖ్య.. ప్రస్తుతం వందకు చేరువైంది. శ్రీకాళహస్తి పేరు చెబితేనే చిత్తూరు జిల్లా ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. ఒక దశలో శ్రీకాళహస్తిలో కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్ కూడా జరిగింది. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ సిబ్బంది మొదలు.. సామాన్యుల వరకు అంతా కరోనా బారినపడ్డారు.
దిగ్భందం : –
దీంతో శ్రీకాళహస్తి పట్టణం మొత్తాన్ని అధికారులు నెల రోజులకుపైగా దిగ్బంధించారు. అత్యంత కఠిన ఆంక్షలు అమలు చేశారు. ఇన్ని చేసినా.. మూడు రోజుల క్రితం వరకు కూడా శ్రీకాళహస్తిలో ఏకంగా 18 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం శ్రీకాళహస్తిలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 97కు చేరింది. దీంతో శ్రీకాహళస్తిలో రెడ్జోన్ సడలించే అవకాశమే కనిపించడం లేదు. కంటైన్మెంట్, రెడ్ జోన్లలో గల ఆలయాల్లోకి భక్తుల ప్రవేశాన్ని కేంద్రం నిషేధించడంతో… ముక్కంటి ఆలయంలో పరమేశ్వరుడి దర్శనానికి భక్తులకు అవకాశం లేకుండా పోయింది.
భక్తులకు నో ఎంట్రీ : –
దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ముక్కంటి ఆలయంలో భక్తుల దర్శనం కోసం అధికారులు ఇది వరకే అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో ప్రత్యేక మార్కింగ్ చేశారు. కనీసం ఐదు నుంచి ఆరు అడుగుల దూరం ఉండేలా వృత్తాలు గీశారు. భక్తులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. రాహు కేతు పూజల విషయంలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చివరికి కేంద్రం కూడా ఆలయాల్లో దర్శనానికి భక్తులకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కానీ రెడ్జోన్ పరిధిలోని శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనానికి మాత్రం భక్తులు నోచుకోలేదు. అధికారులు టెంపుల్లోకి భక్తులకు నో ఎంట్రీ నిర్ణయం తీసుకోవడంతో… స్వామివారి దర్శనానికి మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
Read: తిరుమల శ్రీవారి దర్శనం..TTD ఉద్యోగులతో ట్రయల్ దర్శన్