Chandrababu Naidu: ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా..? ఏపీలో వరుస దాడులపై చంద్రబాబు వీడియో రిలీజ్
ఏపీలో వరుస దుర్ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా? అంటూ వరుస దుర్ఘటనలకు సంబంధించిన వీడియోను చంద్రబాబు విడుదల చేశారు.
![Chandrababu Naidu: ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా..? ఏపీలో వరుస దాడులపై చంద్రబాబు వీడియో రిలీజ్ Chandrababu Naidu: ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా..? ఏపీలో వరుస దాడులపై చంద్రబాబు వీడియో రిలీజ్](https://10tv.in/wp-content/uploads/2023/06/Chandra-babu-Naidu.jpg)
Chandra babu Naidu
Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) వైసీపీ ప్రభుత్వం (ycp government) పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఏపీలో జరుగుతున్న వరుస నేరాలపై ఓ వీడియోను విడుదల చేసిన చంద్రబాబు.. ఇది రాష్ట్రమా.. రావణ కాష్టమా అంటూ ప్రశ్నించారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో నరకం అంటూ వివిధ ఉదాహరణలతో కూడిన వీడియోను చంద్రబాబు విడుదల చేశారు. టెన్త్ కుర్రాడిని వైకాపా నేతలు సజీవ దహనం చేసినా.. ఏలూరులో యాసిడ్ దాడి జరిగినా వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటూ చంద్రబాబు మండిపడ్డారు. నెల్లూరు, మచిలీపట్నంలలో అత్యాచారం ఘటనలపైనా సీఎం జగన్ మోహన్రెడ్డి ఏం మాట్లాడలేదని ధ్వజమెత్తారు.
Chandrababu : 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయండీ .. లేదంటే తప్పుకోండీ : చంద్రబాబు వార్నింగ్
రాజకీయ కక్షతో ఓ మహిళను ట్రాక్టర్తో ఢీకొట్టించి చంపినా జగన్ ఒక్క మాటకూడా మాట్లాడకపోవటంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో వరుస సంఘటనలు జరిగితే సీఎం జగన్ శాంతి భద్రతలపై కనీస సమీక్ష చేయలేదు. ఏదైనా నేరం జరిగితే జగన్మోహన్ రెడ్డికి తెలిసిందల్లా చిక్కటి చిరునవ్వుతో చనిపోయిన వారి కుటుంబాలకు డబ్బులు అందించటం మాత్రమే అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను ప్రజల బిడ్డను అని చెప్పుకుంటున్న జగన్రెడ్డి.. నిజంగా ప్రజల బిడ్డే అయితే దాడులు చేసిన సొంత పార్టీ నేతలను కాపాడుకుంటాడా? నష్ట పరిహారాన్ని నవ్వుతూ ఇప్పిస్తాడా? ప్రజల బిడ్డే అయితే పేదల ప్రాణాలు వెలకట్టే పెత్తందారు అయ్యేవాడా? అంటూ చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఇది రాష్ట్రమా….? రావణ కాష్ఠమా..? #RashtramaaRavanaKaashtamaa#NalugellaNarakam pic.twitter.com/q1LAE2f6yT
— N Chandrababu Naidu (@ncbn) June 26, 2023