Chandrababu’s Delhi Tour: నేడు ఢిల్లీకి చంద్రబాబు.. వైసీపీ దాడులపై ఫిర్యాదు
ఏపీ పాలిటిక్స్... హస్తినలో సెగలు రేపబోతోంది. నిన్నటి దాకా మాటల మంటలు, దీక్షలతో ఓ రేంజ్ లో పొలిటికల్ హీట్ సృష్టించిన టీడీపీ, వైసీపీ.. ఇక ఢిల్లీ వేదికగా తేల్చుకునేందుకు సిద్ధమయ
Chandrababu Naidu Delhi Tour : ఏపీ పాలిటిక్స్… హస్తినలో సెగలు రేపబోతోంది. నిన్నటి దాకా మాటల మంటలు, దీక్షలతో ఓ రేంజ్ లో పొలిటికల్ హీట్ సృష్టించిన టీడీపీ, వైసీపీ.. ఇక ఢిల్లీ వేదికగా తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. చంద్రబాబు నేతృత్వంలో.. టీడీపీ నాయకులు కేంద్రం పెద్దలను కలిసేందుకు రెడీ అయ్యారు. మరోవైపు.. వైసీపీ నేతలు ఈసీని కలిసి తెలుగుదేశం గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేయనున్నారు.
ఏపీ రాజకీయం ఢిల్లీ బాటపట్టనుంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై.. చంద్రబాబు ఢిల్లీలో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు అండ్ టీమ్కు ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా ఖరారైంది. ఈరోజు మధ్యాహ్నం పన్నెండున్నరకు.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు కలవనున్నారు చంద్రబాబు. ఆయనతో పాటు మరో ఐదుగురు టీడీపీ నాయకులకు.. రాష్ట్రపతి కార్యాలయం అపాయింట్మెంట్ ఇచ్చింది. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని.. రాష్ట్రపతి పాలన విధించాలని కోరనున్నారు టీడీపీ నేతలు. మోదీ, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read : Etala Rajender : కుట్రపూరితంగా, నీచపు ఆలోచనతో నన్ను బయటకు పంపారు : ఈటల
ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు ఢిల్లీ పర్యటన అజెండాపై చర్చించారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరడంతో… సోమ, మంగళవారాల్లో చంద్రబాబు అండ్ టీమ్ ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. చంద్రబాబుతో పాటు పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు ఎంపీలు, మరో 14 మంది ముఖ్యనేతలు కలిసి మొత్తం 18 మంది రెండు రోజుల ఢిల్లీకి వెళ్లనున్నారు.
పర్యటన వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతలు ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు అప్పగించారు. ఎన్టీఆర్ భవన్ పై దాడికి సంబంధించి సీబీఐ విచారణ జరపాలని ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కోరటంతో పాటు అవసరమైతే న్యాయవ్యవస్థ తలుపు తడతామని పయ్యావుల కేశవ్ తెలిపారు.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తోన్న టీడీపీకి… వాళ్లిద్దరూ అపాయింట్మెంట్ ఇస్తారా.. లేదా.. అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు.. వైసీపీ నాయకులు కూడా త్వరలోనే ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి.. టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోరనున్నారు. రెండు పార్టీల నాయకులు.. ఢిల్లీ టూర్లకు సిద్ధమవడంతో.. ఏపీ రాజకీయం మరింత హీటెక్కింది. ఢిల్లీ వేదికగా.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది.. మరింత ఆసక్తిగా మారింది.