సంక్రాంతి పండక్కి వస్తానని విగత జీవిగా మారాడు : జమ్మూకశ్మీర్లో చలికి తట్టుకోలేక తెలుగు జవాను మృతి
Telugu soldier killed in Jammu and Kashmir : జమ్మూకశ్మీర్లో తెలుగు ఆర్మీ జవాను అమరుడయ్యాడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని గడ్డకిందపల్లికి చెందిన రెడ్డప్పనాయుడు గత 14 ఏళ్లుగా భారత సైనిక దళంలో జవానుగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే విధుల్లో భాగంగా సరిహద్దుల్లో శనివారం పహారా కాస్తుండగా చలితీవ్రత ఎక్కువ కావడంతో అస్వస్థతకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో సహచర జవానులు గుర్తించి సపర్యలు చేసి వెంటనే హెలికాప్టర్లో ఆర్మీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు.
అయితే రెడ్డప్పనాయుడు అప్పటికే చనిపోయినట్టు ఆర్మీ వైద్యులు ధ్రువీకరించారు. ఆ తర్వాత ఈ విషయాన్ని జవాను కుటుంబీకులకు చేరవేశారు. రెడ్డప్ప నాయుడు మరణ వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. సంక్రాంతి పండక్కి సెలవుపై వస్తానన్న తన కుమారుడు… విగత జీవిగా మారాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
రెడ్డప్పకు భార్య రెడ్డమ్మ, కొడుకు, కుమార్తె ఉన్నారు. రెడ్డప్ప మరణవార్త తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జవాన్ భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు ఇవాళ స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.