Thota Chandrasekhar : ఏపీ ప్రజల్లో కేసీఆర్పై వ్యతిరేకత లేదు, స్టీల్ ప్లాంట్ టేకోవర్కు అవకాశాలు పరిశీలిస్తున్నాం-తోట చంద్రశేఖర్
Thota Chandrasekhar: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అదానీకి ఇవ్వడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. 35వేల మంది కార్మికులు రోడ్డునపడతారని వాపోయారు.
Thota Chandrasekhar : ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏమాత్రం వ్యతిరేకత లేదని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులే కేసీఆర్ ను రమ్మని ఆహ్వానించారని ఆయన చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం అని ఆయన తేల్చి చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మేము ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నాం అన్నారు.
కేంద్రం బిడ్స్ ఆహ్వానించిన నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకించే విషయంలో ఏపీ ప్రభుత్వ చర్యలు కంటితుడుపుగా ఉన్నాయని తోట చంద్రశేఖర్ విమర్శించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో బీఆర్ఎస్ కు ఎలాంటి రాజకీయ ప్రయోజనాలూ లేవని ఆయన స్పష్టం చేశారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరమైతే 35వేల మంది కార్మికులు రోడ్డునపడతారని ఆవేదన వ్యక్తం చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అదానీకి ఇవ్వడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే స్టీల్ ప్లాంట్ కు మైన్స్ కేటాయించలేదన్నారు. స్టీల్ ప్లాంట్ ను టేకోవర్ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తోట చంద్రశేఖర్ తెలిపారు. కచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామన్నారు. వైజాగ్ లో త్వరలోనే భారీ బీఆర్ఎస్ బహిరంగ సభ ఉంటుందన్న తోట చంద్రశేఖర్.. ఆ సభకు కేసీఆర్ వస్తారని చెప్పారు.