Actress Archana Gautam : తిరుమల శ్రీవారి ద‌ర్శ‌నం టికెట్ కోసం రూ.10వేలు డిమాండ్..! సినీ నటి ఆరోపణలను ఖండించిన టీటీడీ

టీటీడీ ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ కు చెందిన నటి అర్చనా గౌతమ్ చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. దర్శనం టికెట్ కోసం సిబ్బంది రూ.10వేలు డిమాండ్ చేశారన్న నటి ఆరోపణలను టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఆమె ఆరోపణల్లో నిజం లేదంది.

Actress Archana Gautam : తిరుమల శ్రీవారి ద‌ర్శ‌నం టికెట్ కోసం రూ.10వేలు డిమాండ్..! సినీ నటి ఆరోపణలను ఖండించిన టీటీడీ

Actress Archana Gautam : టీటీడీ ఉద్యోగులపై ఉత్తరప్రదేశ్ కు చెందిన నటి అర్చనా గౌతమ్ చేసిన ఆరోపణలపై టీటీడీ స్పందించింది. దర్శనం టికెట్ కోసం సిబ్బంది రూ.10వేలు డిమాండ్ చేశారన్న నటి ఆరోపణలను టీటీడీ తీవ్రంగా ఖండించింది. ఆమె ఆరోపణల్లో నిజం లేదంది. అంతేకాదు తనతో సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని, తనపై దాడి చేశారనే ఆరోపణలనూ టీటీడీ తోసిపుచ్చింది. నిజానికి నటి అర్చనే.. టీటీడీ ఉద్యోగులపై దాడికి పాల్పడిందని చెప్పింది. ఈ క్రమంలో అసలేం జరిగిందో టీటీడీ వివరించింది.

తమ ఉద్యోగులపై నటి అర్చనానే దాడి చేసిందని టీటీడీ ఆరోపించింది. అవాస్తవ ఆరోపణలతో ఉద్యోగులపైనే తప్పుడు ఫిర్యాదు చేసిందని వివరించింది. రూ.10,500 టికెట్ తో వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవాలని సిబ్బంది సూచిస్తే, దర్శనం కోసం రూ.10 వేలు డిమాండ్ చేశారని నటి అర్చన ఆరోపించిందని వివరించింది.

ఉత్త‌రప్ర‌దేశ్‌కు చెందిన శివ‌కాంత్ తివారి, న‌టి అర్చ‌నా గౌత‌మ్‌తో పాటు మ‌రో ఏడుగురికి ఆగ‌స్టు 31న శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం కేంద్ర స‌హాయమంత్రి నుంచి సిఫార‌సు లేఖ‌ను తీసుకుని తిరుమ‌ల‌కు వ‌చ్చారు. అద‌న‌పు ఈవో కార్యాల‌యంలో ద‌ర్శ‌నం కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ లేఖపై రూ.300/- ద‌ర్శ‌నం టికెట్లు మంజూరు చేస్తూ శివ‌కాంత్ తివారీకి చెందిన 9454607006 మొబైల్ నెంబర్ కు మెసేజ్ పంపారు. అయితే వారు ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోలేదు. ఆ తర్వాత శివ‌కాంత్ తివారి అద‌న‌పు ఈవో కార్యాల‌యానికి వెళ్లారు. అప్ప‌టికే టికెట్లు తీసుకోవాల్సిన గ‌డువు ముగిసిందని వారు తెలిపారు.

శివ‌కాంత్ తివారితో పాటు అద‌న‌పు ఈవో కార్యాల‌యంలోకి చొచ్చుకుని వ‌చ్చిన న‌టి అర్చ‌నా గౌత‌మ్ ఆగ్ర‌హంతో విచ‌క్ష‌ణ కోల్పోయి కార్యాల‌య సిబ్బందిని దుర్భాష‌లాడారు. స‌ర్ది చెప్ప‌బోయిన ఒక ఉద్యోగిపై చేయి చేసుకున్నారు. తివారి ఆమె చేస్తున్న యాగీని చూస్తూ ఊరుకున్నారు త‌ప్ప ఆమెను వారించే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. చివ‌ర‌కు ఆద‌న‌పు ఈవో కార్యాల‌య సిబ్బంది వారి వివ‌రాలు తీసుకుని రెండోసారి రూ.300/- టికెట్లు కేటాయించినా తీసుకోవ‌డానికి న‌టి అర్చ‌నా గౌత‌మ్ నిరాక‌రించారు.

అనంత‌రం అక్క‌డి నుండి టు టౌన్ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి కార్యాల‌య సిబ్బంది త‌న‌పై చేయి చేసుకుని దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని త‌ప్పుడు ఫిర్యాదు చేశారు. అద‌న‌పు ఈవో కార్యాల‌య సిబ్బందిని అక్క‌డి సిఐ పిలిపించి విచార‌ణ చేప‌ట్టారు. సిబ్బంది తాము తీసిన వీడియోను సిఐకి చూప‌గా న‌టి దురుసుగా ప్ర‌వ‌ర్తించిన విషయం వెలుగుచూసింది. దీంతో న‌టి వెన‌క్కి త‌గ్గి అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

ఆగ‌స్టు 1వ తేదీకి వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్ కావాలంటే రూ.10,500/- చెల్లించి శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ పొందొచ్చ‌ని మాత్ర‌మే సిబ్బంది స‌ల‌హా ఇచ్చారు. వాస్త‌వాలు ఇలా ఉండ‌గా అద‌న‌పు ఈవో కార్యాల‌య సిబ్బంది ద‌ర్శ‌నం టికెట్ కోసం రూ.10 వేలు డిమాండ్ చేశార‌ని స‌ద‌రు వీడియోలో న‌టి ఆరోపించారు. తాను సెల‌బ్రిటీ అయినందు వ‌ల్ల ఏమి చెప్పినా భ‌క్తులు న‌మ్ముతార‌నే అభిప్రాయంతో న‌టి అర్చ‌నా గౌత‌మ్ అవాస్త‌వాల‌తో సోష‌ల్ మీడియాలో దుష్ప్ర‌చారం చేశారు. భ‌క్తులు ఇలాంటి అవాస్త‌వ ప్ర‌చారాల‌ను న‌మ్మ‌ొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసింది టీటీడీ.

కాగా, యూపీకి చెందిన సినీ నటి అర్చనా గౌతమ్ తిరుమలలో రచ్చ రచ్చ చేసింది. వీఐపీ దర్శనం పేరుతో టీటీడీ సిబ్బంది ఒక్కొక్కరి నుంచి రూ.10,500 వసూలు చేస్తున్నారని ఆరోపించింది. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తాను డబ్బు చెల్లించినా, రసీదు ఇచ్చి టోకెన్ ఇవ్వలేదని ఆరోపించింది. దర్శన టోకెన్ కోసం ప్రశ్నిస్తే టీటీడీ సిబ్బంది తనపై దాడి చేసేందుకు ప్రయత్నించారని అర్చనా గౌతమ్ వాపోయింది. స్వామి వారి దర్శనం చేసుకునేందుకు వచ్చిన తనతో టీటీడీ సిబ్బంది దౌర్జన్యపూరితంగా ప్రవర్తించారని ఆమె కన్నీటిపర్యంతమైంది.