YS Jagan: ఏపీలో ముందస్తు ఎన్నికలపై జగన్ క్లారిటీ.. పార్టీ నేతలకు టార్గెట్ ఇచ్చిన సీఎం

ముందస్తు ఎన్నికలపై జగన్ క్లారిటీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని, వచ్చే సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పారు.

YS Jagan: ఏపీలో ముందస్తు ఎన్నికలపై జగన్ క్లారిటీ.. పార్టీ నేతలకు టార్గెట్ ఇచ్చిన సీఎం

AP CM YS Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి జగన్ కొట్టిపారేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఇవాళ ఆయన ఏపీలోని తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. వచ్చే సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నామని అన్నారు. క్యాడర్‌ అత్యంత క్రియాశీలకంగా ఉండాలని చెప్పారు. సోషల్‌ మీడియాను బాగా వినియోగించుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో క్యాంపెయిన్‌ను ఉద్ధృతం చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం చేస్తున్నమంచిని తీసుకెళ్లాలని అన్నారు. దాదాపుగా ఇప్పటికి సగం సచివాలయాల్లో గడపగడపకూ పూర్తిచేశామని తెలిపారు.

ఈ సగం వచ్చే 5 నెలల్లో, అంటే ఆగస్టు నాటికి పూర్తిచేయాలని సూచించారు. నెలకు 9 సచివాలయాలను పూర్తిచేయాలని ఆదేశించారు. నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలని చెప్పారు. సెప్టెంబరు నుంచి వేరే కార్యక్రమాలకు శ్రీకారం చుడదామని తెలిపారు. ఒకవైపున గడపగడపకూ వైఎస్సార్ పార్టీ కార్యక్రమం జరుగుతుంది… రెండోవైపున సచివాలయ కన్వీనర్లు, గృహసారథులతో మమేకం చేసే కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.

వీటికి పార్టీ పరంగా కార్యాచరణ చేస్తున్నామని తెలిపారు. రాజకీయాల్లో తాను నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే.. రాజకీయం అంటే.. మానవ సంబంధాలు అని వ్యాఖ్యానించారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పార్టీ నుంచి పోగొట్టుకోవాలని తాను అనుకోనని తెలిపారు. ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోనని చెప్పారు.

సీరియస్‌గా తీసుకోండి..
“మీతో పనిచేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే ఈ కార్యక్రమాలు. ఈ అడుగులన్నీ కూడా దానికోసమే. ప్రతి నియోజకవర్గంలో లక్షలమంది మనపై ఆధారపడి ఉన్నారు. ప్రజల్లో మీ గ్రాఫ్‌ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం. మన అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారు. అందుకే మన గ్రాఫ్‌ పెంచుకోవాలి. ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి.

అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోండి. ఈ కార్యక్రమం జరిగితే.. కచ్చితంగా గ్రాఫ్‌ పెరుగుతుంది. నేను చేయాల్సింది.. నేను చేయాలి. మీరు చేయాల్సిది మీరు.. చేయాలి. ఈరెండూ సంయుక్తంగా, సమర్థవంతంగా జరిగితే… అప్పుడు కచ్చితంగా 175కి 175 గెలుస్తాం” అని అన్నారు.

“ఫిబ్రవరి 13న గడపగడపకూ కార్యక్రమం మీద రివ్యూ చేశా. దానితర్వాత కార్యక్రమానికి కాస్తగ్యాప్‌ వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా గ్యాప్‌ వచ్చింది. మార్చి 16 వరకూ కోడ్‌ కొనసాగింది. తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. తర్వాత ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి. దీనివల్ల గడపగడపకూ కాస్త గ్యాప్‌ వచ్చింది. మళ్లీ గడపగడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలి.

గేర్‌ మార్చి రెట్టించిన స్పీడ్‌తో కార్యక్రమం చేయాలి. రాష్ట్ర చరిత్రే కాదు… దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగు సంవత్సరాలు గడవక ముందే.. రూ.2లక్షల కోట్ల పైచిలుకు ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అకౌంట్లలో పడింది. అర్బన్‌ ప్రాంతంలో 84 శాతం, రూరల్‌ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు, సగటున 87శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం.

ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి ఎప్పుడూ జరగలేదు. 87 శాతం కుటుంబాలను గమనించినట్టైతే… అర్హులుగా ఉన్నవారిని చాలా పారదర్శకంగా గుర్తించి అమలు చేశాం. పేదవాడు మిస్‌కాకుండా వెరిఫికేషన్‌ చేసి మరీ… వారికి పథకాలు అందిస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల్లో వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చాం.

బీపీఎల్‌ నిర్వచనాన్ని మారుస్తూ… గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10వేలకు, అర్బన్‌ ప్రాంతాల్లో రూ.12వేలకు పెంచి పథకాలు ఇచ్చాం. ఇలా చేస్తే 87శాతం ఇళ్లకు నేరుగా డీబీటీ ద్వారా బటన్‌ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం. 21 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 17 స్థానాల్లో మనం గెలిచాం. మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు. కొన్ని వాస్తవాలు అందరికీ తెలియాలి.

ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు. అంటే ఎమ్ముల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది. ఆ పరిధిలో 87 శాతం అంటే.. అక్కాచెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి. అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు.

వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు. కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు. ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ అవుతుంది. రాష్ట్రంలో ఎలక్టోరల్‌ రిప్రజెంటేటివ్‌ శాంపిల్‌ ఏదైతే.. ఉందో.. అది ఇది కాదు. ఒకటో ప్రాధాన్యం.. రెండో ప్రాధాన్యం… మూడో ప్రాధాన్యాలు ఉన్నాయి. మిగిలిన పార్టీ అందరూ కలిశారు.. మనం ఒక్కరిమే. అయినప్పటికీ కూడా… తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదు. ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉందికాబట్టి.. జరిగింది.

అయినా కూడా ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు. 60 మందికి టిక్కెట్లు ఇవ్వని లిస్టు కూడా తయారుచేస్తున్నారని చెబుతారు. ఇదే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇంతకంటే.. దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని కూడా ప్రచారం చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్‌ చేసి మరీ విష ప్రచారంచేస్తున్నారు.

రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. అందుకే అంటున్నా.. మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం. వారంతా గజ దొంగల ముఠా. దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం వచ్చాక గండిపడింది. అందుకే గజదొంగల ముఠా ఇవన్నీ చేస్తున్నాయి. రూమర్లు వస్తున్నాయనే మాట మనకు తెలిసి ఉండాలి. వాటిని తిప్పికొట్టాలి. ఈనెల 13న జగనన్నకు చెబుదాం కార్యక్రమం. ఇండివిడ్యువల్‌ గ్రీవెన్స్‌సెస్‌ను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం” అని జగన్ చెప్పారు.

CM Jagan Mohan Reddy : పార్టీ నేతలతో సీఎం జగన్ భేటీ