ఆత్మపరిశీలనకు సమయం కేటాయించండి
Modi speech at Lucknow University ప్రజలు డిజిటల్ పరికరాలకు అలవాటుపడి…తమ కోసం సమయం కేటాయించుకోవడం మానేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు ఆత్మపరిశీలనకు సమయం కేటాయించడం లేదని ప్రధానమంత్రి అభిప్రాయపడ్డారు.
డిజిటల్ పరికరాలకు, సామాజిక మాధ్యమాలకు ఎల్లప్పుడూ సమయం కేటాయిస్తున్నారని.. సొంత విషయాలను కూడా చూసుకోవాలని సూచించారు. అయితే తమను తాము తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని.. దీని వల్ల సామర్థ్యం, ఆత్మ విశ్వాసం పెరుగుతుందని చెప్పారు.
బుధవారం లఖ్నవూ విశ్వవిద్యాలయం 100ఏళ్ల శంకుస్థాపన దినోత్సవంలో వర్చువల్గా పాల్గొన్నారు ప్రధాని. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంప్తో పాటు 100 రూపాయల నాణాన్ని విడుదల చేశారు మోడీ.
ఈ సందర్భంగా స్థానిక వస్తువులను ప్రోత్సహించేలా కోర్సులు రూపొందించాలని మోడీ సలహా ఇచ్చారు. స్థానిక నైపుణ్యాన్ని విశ్లేషించి, స్థానిక వస్తువుల కోసం వర్సిటీ ఓ కోర్సును ఎందుకు రూపొందించకూడదు? తన పరిధిలోని జిల్లాల్లో వారి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎందుకు కృషి చేయకూడదు? స్థానిక వస్తువులపై వర్సిటీ పరిశోధన చేయవచ్చు. ఓ స్థానిక వస్తువుకు సంబంధించి.. బ్రాండ్, మార్కెటింగ్, ఇతర వ్యూహాలపై ఓ కోర్సు ఉంటే బాగుంటుందని మోడీ అన్నారు.
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నూతన జాతీయ విద్య విధానం.. ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఉద్దేశించినదని ప్రధాని పేర్కొన్నారు.