Forbes Richest Women 2023: అమెరికాలో సత్తాచాటారు..! స్వయంకృషితో ఎదిగిన మహిళా సంపన్నుల జాబితాలో నలుగురు భారతీయ సంతతి మహిళలు

అమెరికాలో స్వయంకృషితో వ్యాపారసామ్రాజ్యంలో ఎదిగిన వంద మంది జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. వీరిలో నలుగురు భారతీయ సంతతి మహిళలు ఉన్నారు.

Forbes Richest Women 2023: అమెరికాలో సత్తాచాటారు..! స్వయంకృషితో ఎదిగిన మహిళా సంపన్నుల జాబితాలో నలుగురు భారతీయ సంతతి మహిళలు

Forbes' 2023 Richest Self-Made Womens

Updated On : July 11, 2023 / 8:43 AM IST

America Richest Self-Made Women : అమెరికాలో స్వయంకృషితో ఎదిగిన తొలి వంద మంది మహిళా సంపన్నుల జాబితాను ఫోర్బ్స్ తాజాగా విడుదల చేసింది. ఈ స్థానంలో నలుగురు భారతీయ సంతతికి చెందిన మహిళలు చోటు దక్కించుకున్నారు. వ్యక్తిగత ఆస్తుల విలువతో పాటు, కంపెనీల్లో వారికున్న వాటాల విలువ ఆధారంగా ఈ జాబితాను రూపొందించడం జరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది. వీరిలో పెప్సికో మాజీ చైర్మన్, సీఈఓ ఇంద్రా నూయీ, ఆరిస్టా నెట్‍‌వర్క్ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్, సింటెల్ ఐటీ సంస్థ సహ వ్యవస్థాపకురాలు నీర్జా సేథీ, కాన్ ఫ్లూయెంట్ సహ వ్యవస్థాపకురాలు నేహా నార్ఖడే ఉన్నారు.

Forbes List: వరుసగా నాలుగోసారీ శక్తివంతమైన మహిళగా నిలిచిన నిర్మలా సీతారామన్

ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో.. వంద మందిలో జయశ్రీ ఉల్లాల్ 2.4 బిలియన్ డాలర్ల నికర ఆస్తులతో 15వ స్థానాన్ని దక్కించుకుంది. నీర్జా సేథీ 990 మిలియన్ డాలర్ల సంపదతో 25వ స్థానంలో నిలిచింది. నేహా నార్ఖడే 520 మిలియన్ డాలర్ల సంపదతో 50వ స్థానంను దక్కించుకుంది. ఇంద్రా నయీ 350 మిలియన్ డాలర్ల సంపదతో 77వ స్థానంలో నిలిచింది. ఫోర్భ్స్ విడుదల చేసిన ఈ జాబితాలో ఏబీసీ సప్లై సహ వ్యవస్థాపకురాలు డైనీ హెండ్రిక్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఆమె ఈ ఘనత సాధించడం వరుసగా ఇది ఆరోసారి. ప్రస్తుతం ఆమె నికర ఆస్తుల విలువ 15 బిలియన్ డాలర్లు

 

జయశ్రీ ఉల్లాల్ 2008 నుంచి ఆరిస్టా నెట్‌వర్క్ ప్రెసిడెంట్, సీఈఓగా కొనసాగుతున్నారు. ఈ సంస్థలో ఆమెకు 24శాతం వాటా ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఆరిస్టా 2022లో 4.4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది.

నీర్జా సేథీ 1980లో భర్త భరత్ దేశాయ్ తో కలిసి  సింటెల్ ను స్థాపించారు. కంపెనీ నుంచి తన వాటా కింద ఆమె 510 మిలియన్ డాలర్లు పొందినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది.

నేహా నార్ఖడే గతంలో లింక్డ్‌ఇన్‌లో సాప్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేశారు. లింక్డ్ఇన్‌లో కీలకమైన ఓపెన్ సోర్స్ మెసెజింగ్ సిస్టమ్ అపాచీ కఫాను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. 2014లో లింక్డ్‌ఇన్‌ను వీడి ఇద్దరు సహఉద్యోగులతో కలిసి కాన్ ప్లూయెంట్ ను నేహా నార్ఖండే స్థాపించారు. ఈ సంస్థల్లో నేహాకు ఆరుశాతం వాటా ఉన్నట్లు ఫోర్బ్స్ తెలిపింది.

ఇంద్రా నూయీ 2019లో పెప్సికో నుంచి పదవీ విరమణ చేశారు. 24ఏళ్ల పాటు సంస్థలో అత్యున్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించిన ఇంద్రా నూయీ పెప్సీకో ఆదాయాన్ని పెంచడంలో కీలక భూమిక పోషించారు. 2019 తరువాత అమెజాన్‌లో బోర్డు సభ్యురాలిగా కొనసాగుతున్నారు.