Royal Enfield EV : బైకులకు రారాజు.. రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ వచ్చేస్తోంది.. గెట్ రెడీ..!
Royal Enfield EV : రాయల్ ఎన్ఫీల్డ్.. ఈ బుల్లెట్ ఉంటే ఆ దర్జానే వేరు.. అందుకే బైకులకే రారాజు పిలుస్తారు.. డుగ్ డుగ్ మోటార్ బండి ఇక ఎలక్ట్రిక్ బైకుగా మారిపోనుంది. 2025 నాటికి రాయల్ ఎన్ ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
Royal Enfield Maker Eicher Motors : భారత ప్రముఖ మోటార్సైకిల్ తయారీదారు రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. మిడిల్ వెయిట్ విభాగంలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) వ్యూహాన్ని అమలు చేసేందుకు దాదాపు రూ. 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. ప్రస్తుత (FY24) ఆర్థిక సంవత్సరంలో రాయల్ ఎన్ఫీల్డ్ రూ. వెయ్యి కోట్ల మూలధన కేటాయింపులో 25 శాతం నుంచి 30శాతం కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మేరకు భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ సీఈఓ బీ గోవిందరాజన్ (B Govindarajan) తెలిపారు.
ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధిపై దాదాపు వెయ్యి కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్ఫారమ్లపై రాయల్ ఎన్ఫీల్డ్ పనిచేస్తోందని గోవిందరాజన్ తెలిపారు. 2025 నాటికి మొదటి ప్రీమియం ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ను లాంచ్ చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ సీఈఓ ధృవీకరించారు. కస్టమర్లు రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఏం కావాలో అది ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పుడు అదే పెట్టుబడులపై దృష్టిసారించామన్నారు. సరఫరా గొలుసును కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు. 2025 నాటికి రాయల్ కస్టమర్లకు బ్రహ్మాండమైన రాయల్ ఈవీ మోటార్సైకిల్ను అందజేస్తామని హామీ ఇస్తున్నామని గోవిందరాజన్ స్పష్టం చేశారు.
చెన్నైలో 60 ఎకరాల భూమి కొనుగోలు :
ఇటీవలే చెన్నైలో చేయార్ వద్ద 60 ఎకరాల భూమిని రాయల్ కంపెనీ కొనుగోలు చేసింది. కంపెనీకి చెందిన ప్రస్తుత ప్లాంట్లకు 20 కిలోమీటర్ల దూరంలో మూడవ ప్లాంట్ను నిర్మిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రస్తుతం వల్లంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి లైన్ను ఏర్పాటు చేస్తోంది. చివరికి చెయ్యార్ ప్లాంట్లో EV ఉత్పత్తిని ఏకీకృతం చేయాలని భావిస్తోందని గోవిందరాజన్ చెప్పారు. కంపెనీ ప్రారంభంలో రెండు షిఫ్ట్ల ప్రాతిపదికన ఏడాదికి లక్ష యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాలకు మూలధన కేటాయింపులు ఏడాదికి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, దేశీయంగా, అంతర్జాతీయ మార్కెట్లలో వ్యాపార విస్తరణకు రాయల్ ఎన్ఫీల్డ్ అంతర్గత దహన పోర్ట్ఫోలియోలో పెట్టుబడిని కొనసాగించాలని యోచిస్తోంది. ఇప్పటికే థాయ్లాండ్, బ్రెజిల్, కొలంబియా, అర్జెంటీనాలోని (CKD) ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వచ్చే నెలలో నేపాల్లో కొత్త అసెంబ్లీ ప్లాంట్ ప్రారంభించాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది ఆ తర్వాత బంగ్లాదేశ్లోనూ కొత్త సీకేడీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
సొంత నిధులతోనే ఎన్ఫీల్డ్ ఈవీల తయారీ :
రాయల్ ఎన్ఫీల్డ్ విదేశాల్లో 1,100 రిటైల్ అవుట్లెట్లను కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కంపెనీ అవుట్లెట్లను విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ మార్కెట్ భారత్ వెలుపల దాదాపు మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఇందులో కంపెనీ మార్కెట్ వాటా 7శాతం నుంచి 8శాతంగా ఉందని కంపెనీ సీఈఓ తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్కి ఇన్ఫ్లెక్షన్ పాయింట్ కూడా ఉంది. వచ్చే దశాబ్దంలో ఎగుమతుల్లో అద్భుతమైన వృద్ధి చూస్తామని గోవిందరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాయల్ ఎన్ఫీల్డ్ EV ప్రోగ్రామ్ కోసం మూలధనాన్ని సేకరించే విషయంలో సీఈవీ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే కంపెనీకి తగినంత నగదు నిల్వలు ఉన్నాయని అన్నారు. ఈ దశలో బయటి మూలధనం అవసరం లేదని సీఈఓ స్పష్టం చేశారు.
రాయల్ ఎన్ఫీల్డ్ మొత్తం (EV) బైకుల కోసం సొంతంగా నిధులను సమకూరుస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ EV పోర్ట్ఫోలియోపై 60 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక బృందం పని చేస్తోంది. గోవిందరాజన్, ఎలక్ట్రిక్ పర్ఫామెన్స్ మోటార్సైకిల్ తయారీదారు స్టార్క్ ఫ్యూచర్స్తో సహకారం కొనసాగిస్తామని గోవిందరాజన్ తెలిపారు. రాయల్ ఎన్ఫీల్డ్ యూరోపియన్ కంపెనీకి ఉత్పత్తి, సరఫరా గొలుసులను పెంచడంలో సాయం చేస్తోందని చెప్పారు. అయితే స్టార్క్ ఫ్యూచర్స్ రాయల్ ఎన్ఫీల్డ్కు మోటార్, బ్యాటరీ టెక్నాలజీ, కచ్చితమైన ఎలక్ట్రానిక్స్తో సపోర్టు అందిస్తోందని గోవిందరాజన్ పేర్కొన్నారు.
మిడిల్-వెయిట్ సెగ్మెంట్లో అగ్రగామి :
రాయల్ ఎన్ఫీల్డ్ 93 శాతం కన్నా ఎక్కువ వాటాతో మోటార్సైకిల్ మార్కెట్లోని మిడిల్-వెయిట్ సెగ్మెంట్లో అగ్రగామిగా కొనసాగుతోంది. ఇప్పుడు కంపెనీ ఈవీ ప్లాన్లను బహిర్గతం చేసి లెగసీ మోటార్సైకిల్ తయారీదారులలో మొదటిదిగా చెప్పవచ్చు. అదేవిధంగా, ఐషర్ మోటార్స్ మోటార్సైకిల్ తయారీ విభాగంలో EV టెక్నాలజీతో మరింత దూకుడుగా నిర్మిస్తోంది. గ్లోబల్ మార్కెట్ విస్తరణలో భాగంగా ‘డిఫరెన్సియేటెడ్ మోటార్సైకిల్’ని రూపొందించే దిశగా కంపెనీ కృషి చేస్తోందని గోవిందరాజన్ అన్నారు. రాబోయే ఎన్ఫీల్డ్ L-ప్లాట్ఫారమ్ ఆధారిత ఇ-బైక్, L1C అనే సంకేతనామం. సంవత్సరానికి 5వేల యూనిట్ల ప్రారంభ వాల్యూమ్ ప్లాన్తో 2025 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని క కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందని సీఈఓ వెల్లడించారు.