మాయమాటలు చెప్పి బాలికను రేప్ చేసి హత్య చేసిన దుండగుడు

  • Published By: murthy ,Published On : July 3, 2020 / 05:48 PM IST
మాయమాటలు చెప్పి బాలికను రేప్ చేసి హత్య చేసిన దుండగుడు

తమిళనాడులోని పుదుక్కోటైలో దారుణం జరిగింది. ఏడేళ్ల మైనర్ బాలికను రేప్ చేసి, హత్యచేశాడో దుండగుడు. పుదుక్కోటై జిల్లాలోని ఎంబాల్ గ్రామంలోని చెరువులో ఏడేళ్ల బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. పోస్టు మార్టం నిమిత్తం శవాన్ని ఆస్పత్రికి తరలించారు.  బాలిక హత్య కేసుకు సంబంధించి అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల ఎం.రాజా అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

మంగళవారం, జూన్ 30 వ తేదీ సాయంత్రం తమ కుమార్తె కనిపించటం లేదని బాలిక తండ్రి ఎంబాల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. బుధవారం నాడు బాలిక మృతదేహాన్ని స్ధానికంగా ఉన్న ఎండిపోయిన చెరువులో కనుగొన్నారు. పోలీసులు బాలిక శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు.

బాలికను చివరిసారిగా గ్రామంలో ఆమె ఇంటి సమీపంలో ఉండే రాజా అనే వ్యక్తితో చూసినట్లు స్ధానికులు తెలిపారు. పోలీసులు రాజాను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. బాలికను ఊళ్లోని దేవాలయానికి  తీసుకువెళ్లి అక్కడి నుంచి సమీపంలోని చెరువు వద్దకు తీసుకువెళ్లాడు.  అక్కడ బాలికపై అత్యాచారం చేయబోగా బాలిక కేకలు వేసింది. దీంతో నిందితుడు సమీపంలోని చెక్కతో బాలికను చావ బాది పారిపోయాడు.

నిందితుడు రాజాపై ఐపీసీ సెక్షన్ 364, 376,302 సెక్షన్లు కింద పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ చట్టం.. సెక్షన్ 3 (2) (వి) కింద కేసులు నమోదు చేశారు. కాగా… బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని బాధితురాలి సామాజిక వర్గానికి చెందిన వారు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని సీఎం ఈ.కే. పళని స్వామి ప్రకటించారు.

Read:యూపీ పోలీసులను చంపిన వ్యక్తి వెనుక ఉంది ఎవరు.. 60 మర్డర్ కేసుల్లో నిందితుడు?